ఢిల్లీ నుంచి ముఖ్యమైన ఫోన్‌ కాల్‌: ఉత్తమ్‌

14 Sep, 2018 12:44 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనపై క్లారిటీ వచ్చే అవకాశం

సాక్షి, న్యూఢిల్లీ : ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనపై కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సహా పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో శుక్రవారం సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపై అధిష్టానంతో చర్చలు జరిపినట్లు సమాచారం. రాహుల్‌తో భేటీ అనంతరం పలువురు తెలంగాణ నేతలకు ఉత్తమ్‌ నుంచి మెసేజ్‌లు వచ్చాయి. ‘ప్రియమైన స్నేహితుల్లారా.. ఢిల్లీ నుంచి మీకు ఒక ముఖ్యమైన ఫోన్‌ కాల్‌ రానుంది. రిసీవ్‌ చేసుకుని స్పందించడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నానంటూ’ ఉత్తమ్‌ సందేశాలు పంపించారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటనపై స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల్లో టెన్షన్‌ పెరిగిపోయింది. మెసేజ్‌ అందుకున్నవారేమో ఎందుకు వచ్చిందన్న అనుమానంతో.. మెసేజ్‌ రాని వారు తమకు ఎందుకు రాలేదా అన్న సందేహంతో ఆందోళన చెందుతున్నారు. కాగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి, టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. సినీ నిర్మాత బండ్ల గణేశ్‌, టీఆర్‌ఎస్‌ అసమ్మతి ఎమ్మెల్సీ భూపతిరెడ్డి శుక్రవారం రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా దాస్‌
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా భక్త చరణ్‌దాస్‌ను రాహుల్ గాంధీ నియమించారు. స్క్రీనింగ్ కమిటీ సభ్యులుగా ప్రణబ్ ముఖర్జీ కుమార్తె  శర్మిష్ఠ ముఖర్జీ, జ్యోతిమనిసెంథిమలై నియమితులయ్యారు.

మరిన్ని వార్తలు