మైనార్టీల ఓట్లడిగే హక్కు టీఆర్‌ఎస్‌కు లేదు: ఉత్తమ్‌

9 Jun, 2018 01:27 IST|Sakshi

నిర్మల్‌: టీఆర్‌ఎస్‌కు మైనార్టీల ఓట్లు అడిగే హక్కు లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, స్థానికుడు అర్జుమంద్‌అలీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో సీఎల్పీ నేత కె.జానారెడ్డి,, మండలిలో కాంగ్రెస్‌ విపక్ష నేత షబ్బీర్‌అలీ తదితరులతో కలసి ఆయన పాల్గొన్నారు.

ఉత్తమ్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారని, నాలుగేళ్లయినా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం ఉందన్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం, బీజేపీలకు ఓట్లు వేస్తే వృథాయేనని చెప్పారు.  రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కేంద్రంలో బీజేపీ పాలనతో అభద్రత, అసహనం పెరిగాయని జానా అన్నారు.    ఎంఐఎంను అడ్డుపెట్టుకుని ముస్లింలతో కేసీఆర్‌ గేమ్‌ ఆడుతున్నారని షబ్బీర్‌ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు