టీఆర్‌ఎస్‌ను ఓడించేది మేమే

31 Jul, 2019 01:51 IST|Sakshi
మీడియాతో మాట్లాడుతున్న ఉత్తమ్‌. చిత్రంలో భట్టి విక్రమార్క, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

విలేకరులతో ఇష్టాగోష్టిలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ధీమా

తెలంగాణలో కాంగ్రెస్‌కే సంస్థాగత బలం

బీజేపీకి రాష్ట్రంలో పట్టు లేదు

టీఆర్‌ఎస్‌–బీజేపీది నకిలీ యుద్ధం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ను ఓడించగల శక్తి కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో కాంగ్రెస్‌కు మాత్రమే సంస్థాగత బలం ఉంది. మా పార్టీ స్వరూపం కూడా చాలా భద్రంగా ఉంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చి లక్కీ లాటరీలో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచినంత మాత్రాన బీజేపీకి రాష్ట్రంలో పట్టు లేదు. సంప్రదాయంగా ఆ పార్టీకి బలం ఉన్న నాలుగైదు పట్టణాల్లో కొంత ప్రభావం కనిపిస్తుంది. అంతకుమించి క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ఎక్కడా లేదు. మీడియానే బీజేపీని ఎక్కువ చేసి చూపిస్తోంది. తెలంగాణ ప్రజలు స్వభావికంగానే లౌకికవాదులు. మతతత్వ సిద్ధాంతంతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం తెలంగాణలో కుదరదు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో గులాబీ దళాన్ని చిత్తు చేసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతాం’అని ఆయన వ్యాఖ్యానించారు. మంగళవారం గాంధీ భవన్‌లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులతో కలసి ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీజేపీ బలమేంటో స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తేలిపోయిందని ఎద్దేవా చేశారు. పరిషత్, పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్‌ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నామని, ఈ ఎన్నికల్లోనూ సత్తా చాటుతామన్నారు. 

అంతర్గతంగా కమలం–గులాబీ కలిసే... 
సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేసేలా బీజేపీ తెచ్చిన సవరణ బిల్లుకు టీఆర్‌ఎస్‌ మద్దతు పలికిందని, ఆ పార్టీ ఎంపీలు ఓటేసినందుకే రాజ్యసభలో ఆ బిల్లు గట్టెక్కిందని ఉత్తమ్‌ గుర్తుచేశారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని, వారిద్దరిదీ బయట నకిలీ యుద్ధమని, లోపల మాత్రం కలిసే పనిచేస్తున్నారని విమర్శించారు. బీజేపీ పెట్టిన బిల్లుకు టీఆర్‌ఎస్‌ మద్దతు పలకడమే ఇందుకు నిదర్శనమన్నారు. 

నియంత పాలన కోసమే మున్సిపల్‌ బిల్లు... 
రాష్ట్రంలో నియంత పాలనను నడిపించాలనే ఉద్దేశంతోనే స్థానిక సంస్థలపై కలెక్టర్లకు అధికారాన్ని కట్టబెట్టి సీఎం కేసీఆర్‌ మున్సిపల్‌ బిల్లు తీసుకొచ్చారని ఉత్తమ్‌ విమర్శించారు. 85 శాతం మొక్కలు పెరగకపోతే వార్డు సభ్యులను సస్పెండ్‌ చేస్తామని చట్టంలో పెట్టారని, మరి తెలంగాణలో ఇప్పటివరకు నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు పెరగలేదని, అందుకు సీఎం, మంత్రులు బాధ్యత వహిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఈ చట్టం నిలబడేది కాదని, తాము కూడా చట్టపరంగా సవాల్‌ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ జెండా పండుగ కార్యక్రమాన్ని వచ్చే నెల 4వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ఉత్తమ్‌ చెప్పారు. కొన్ని ఆకస్మిక ఘటనలు, వర్షాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు. 

పోలీసు రాజ్యంగా మారుస్తున్నారు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని పోలీసు రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఉత్తమ్‌ ఆరోపించారు. గతంలో టెర్రరిస్టు సంస్థలపై నిఘా ఉంచేవారని, ఇప్పుడు తెచ్చిన చట్టం ద్వారా దేశంలోని ఏ వ్యకినైనా టెర్రరిస్టు పేరుతో అదుపులోకి తీసుకొని ఆరు నెలల వరకు బెయిల్‌కు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా చేశారని మండిపడ్డారు. రైతుల ఆదాయాన్ని 2022 నాటికి రెట్టింపు చేస్తామని పదేపదే బీజేపీ నేతలు చెబుతున్నారని, అలా జరగా లంటే ఇప్పటివరకు కనీసం రైతు ఆదాయం అందులో సగమైనా పెరగాలి కదా అని ప్రశ్నించారు. నామమాత్రంగా కనీస మద్దతు ధర పెంచి వదిలేశారని, మరోవైపు ఎరువులు, పురుగు మందుల ధరలు పెరిగాయని, వ్యవసాయ వృద్ధి పడిపోయిందని ఉత్తమ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు