చిన్నారి హత్య: బీజేపీపై శివసేన ఫైర్‌

10 Jun, 2019 12:11 IST|Sakshi

అలీగఢ్‌ ఘటన మానవత్వానికి మచ్చలా నిలిచింది

యోగి ప్రభుత్వంలో బాలికలను రక్షణ కరువైంది

శివసేన మౌత్‌పీస్‌ సామ్నాలో కథనం

సాక్షి, ముంబై: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చిన్నారిని పాశవికంగా హత్య చేసిన ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెళ్లువెత్తుతున్నాయి. యూపీలోని యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యక్తమతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులకు రక్షణ కల్పించడంలో యోగి సర్కారు తీవ్రంగా విఫలమయిందంటూ శివసేన మౌత్‌పీస్‌ సామ్నా పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘దేశ రాజధాని ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు తీవ్రంగా వినిపించాయి. అప్పుడు ఆందోళన చేపట్టినవారు నేడు ప్రభుత్వంలో ఉన్నారు. కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితుల్లో మార్పు రాలేదు. ముఖ్యంగా యూపీలో చిన్నారులపై ఆత్యాచారాలు మరింత పెరిగాయి. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చాలా దారుణం.  చిన్నారులకు  రక్షణ కల్పించేందుకు యోగి ప్రభుత్వం వెంటనే చర్యలను చేపట్టాలి. భేటీ బచావో.. భేటీ పడావో నినాదంతో ముందుకెళ్లాలి. మానవత్వానికి మాయని మచ్చలా అలీగఢ్‌ ఘటన నిలిచింది’ అంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
(పాశవిక హత్యపై ప్రకంపనలు)

కాగా టప్పల్‌ పట్టణానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక మే 30వ తేదీన కనిపించకుండాపోయిన బాలిక దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.  బాలిక తల్లీదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. పోమరో మూడు రోజుల తర్వాత జూన్‌ 2వ తేదీన బాలిక మృతదేహం ఆమె నివాసానికి సమీపంలోనే చెత్తకుప్పలో కనిపించింది. రూ.10వేల అప్పు బాలిక తండ్రి బన్వరీలాల్‌ తిరిగి ఇవ్వనందునే ఈ దారుణానికి పాల్పడినట్లు తమ అదుపులో ఉన్న జహీద్, అస్లాం అంగీకరించారని పోలీసులు తెలిపారు. గత నెల 30వ తేదీన జరిగిన ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. 

నిందితుల్లో ఒకరైన జహీద్‌ సొంత కూతురిపైనే అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. ఏడేళ్ల కూతురిపై 2014లో అఘాయిత్యానికి పాల్పడి, హత్య చేసిన కేసులో అతను అరెస్టయ్యాడని, బెయిల్‌పై తిరుగుతున్నాడని పోలీసులు వెల్లడించారు. తాజా కేసుతో కలిపి మొత్తం అతనిపై నాలుగు కేసులు ఉన్నాయని తెలిపారు. ఇక నిందితులు జహీద్‌, అస్లాంను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిపై జాతీయ భద్రత చట్టం కింద కేసు నమోదు చేశారు. క్రైం బ్రాంచ్‌ ఎస్పీ, మరో ఎస్పీతో కూడిన సిట్‌ బృందం ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

మరిన్ని వార్తలు