ఉత్తరా ఖండ్ బీజేపీ ఆఫీసులో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. స్థానిక వ్యాపారి పాండే విషం తీసుకొని డెహ్రాడూన్లోని బీజేపీ కార్యాలయంలోకి చొచ్చుకు రావడం కలకలంరేపింది. దీంతో అక్కడున్న వారంతా షాక్కు గురయ్యారు. ఆసుపత్రిలో పొందుతున్న ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
బీజేపీ మంత్రి సుబోధ్ ఉనియాల్ శనివారం నిర్వహించిన జనతా దర్బార్లో ప్రజల సమస్యలను వింటుండగా ఈ హఠాత్పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా త్రివేంద్ర రావత్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంపై ఆరోపణలు గుప్పిస్తూ ఈ చర్యకు దిగారు. నోట్ల రద్దు, జీసీటీ కారణంగా తాను వ్యాపారంలో బాగా నష్టపోయాననీ, అప్పులు ఊబిలో కూరుకుపోయానని ఆయన ఆరోపించారు. గత అయిదు నెలలనుంచి ప్రభుత్వాన్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ ముఖ్యమంత్రి నాగోడు వినడం లేదు.. నాలాంటి వాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. ఇక బతకాలని లేదు. అందుకే విషం తీసుకున్నానంటూ విలపిస్తూ పాండే కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. పాండే విషం తీసుకున్న విషయాన్ని ఆసుపత్రి సీనియర్ అధికారి ధవీకరించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందనీ, తదుపరి 24 గంటలు కీలకమని వైద్యులు ప్రకటించారు.
మరోవైపు జీఎస్టీ, డిమానిటైజేషన్ మూలంగా తాను విషం సేవించానని పాండే చెప్పారని మంత్రి ఉనియాల్ మీడియాకు వివరించారు. వ్యాపారంలో నష్టం వ్యక్తిగత సమస్య కాదు. అయితే దీనివెనుక రాజకీయకుట్ర దాగి వుందని భావిస్తున్నానన్నారు.
కాగా గత అయిదేళ్లుగా రవాణా బిజినెస్లో ఉన్న పాండే ఇటీవల తీవ్ర నష్టాలపాలైనట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే తన పరిస్థితిని వివరిస్తూ ప్రధానమంత్రి కార్యాలయానికి, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర రావత్కు తన ఫిర్యాదుల గురించి రాశారు.