గుసగుసలు
ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఓ మంత్రి తన శాఖలో రూ.4500 కోట్ల పనులకు గత ఏడాది ప్రతిపాదనలు రూపొందించారు.ఈ పనుల బాధ్యత చూసే చీఫ్ ఇంజనీరునే తనకు ఓఎస్డీగా నియమించుకొని తెరవెనుక కథ నడిపారు. ఆ పనులకు యాన్యుటీ పద్ధతిలో టెండర్లు పిలిచారు. నచ్చిన వారికి 15 శాతం ఎక్సెస్కు పనులు కట్టబెట్టి భారీగా కమీషన్ తీసుకోవాలని అనుకున్నారు. అయితే మా నియోజకవర్గాల్లో మాకు చెప్పకుండా మంత్రి ఎలా ప్రతిపాదనలు తయారుచేయిస్తారని టీడీపీ ఎమ్మెల్యేలు సీఎం వద్ద పంచాయతీ పెట్టారు. దీంతో సీఎం ఈ యాన్యుటీ టెండర్లను నిలిపివేసి ఎమ్మెల్యేలు చెప్పిన పనులే ప్లాన్లో పెట్టాలని సూచించారు. దీంతో వ్యవహారం తారుమారవుతోందని గమనించిన సదరు మంత్రి కొత్త ఎత్తు వేశారు.
తన జిల్లా ఎమ్మెల్యేలతో పాటు ఇతర సన్నిహిత ఎమ్మెల్యేలు, నేతలతో విజయవాడలో రహస్య సమావేశాలకు తెర తీశారు. వీరందరితో కలిసి జనసేనలోకి జంప్ చేయబోతున్నట్లుగా కలరింగ్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న బాబు వెంటనే రూ.4500 కోట్ల యాన్యుటీ ఆగమేఘాలపై తెప్పించుకున్నారు. 15 శాతం ఎక్సెస్కు కాకుండా కొంత తగ్గించేలా టెండర్లను మళ్లీ దాఖలు చేయించి ఓకే చేశారు. గతంలో కాంగ్రెస్పార్టీలో కూడా మంత్రిగా ఉండి ఎమ్మెల్యేలతో టీడీపీలోకి వచ్చిన ఈ మంత్రి మళ్ళీ అలాగే చేసినా చేస్తాడేమోనని బాబు టెండర్లను ఓకే చేశారు.