తల ఎప్పుడు నరుక్కుంటావ్‌..?

13 Oct, 2018 04:10 IST|Sakshi
మాట్లాడుతున్న వీహెచ్‌

కేసీఆర్‌ను ఎద్దేవా చేసిన వీహెచ్‌

మెదక్‌జోన్‌/నర్సాపూర్‌: తెలంగాణకు దళితుడిని తొలి ముఖ్యమంత్రిగా చేయనందుకు.. గతంలో ఇచ్చిన మాట మేరకు తల ఎప్పుడు నరుక్కుంటావని ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన మెదక్‌ పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాడు రాష్ట్రానికి కాపలా కుక్కలా ఉంటానని చెప్పిన మోసగాడు కేసీఆర్, నేడు సోనియా గాంధీనే విమర్శిస్తున్నాడని మండిపడ్డారు.

తెలంగాణ ద్రోహులైన మహేందర్‌రెడ్డి, తలసాని, తుమ్మలకు మంత్రి పదవులిచ్చిన కేసీఆర్, నేడు మహాకూటమిలో భాగంగా టీడీపీతో పొత్తుపెట్టుకుంటే ఎందుకు చిందులు వేస్తున్నారని మండిపడ్డారు. అడ్డదారుల్లో మళ్లీ అధికారం దక్కించుకుని కొడుకుకు పట్టం కట్టేందుకు కేసీఆర్‌ తహతహలాడుతున్నాడని వీహెచ్‌ ఆరోపించారు. తండ్రిలాగ కొడుకు సైతం ప్రతిపక్షాలను నీచ సంస్కృతితో తిడుతున్నాడని నిప్పులు చెరిగారు. కాగా, మెదక్‌ పట్టణం నుంచి వీహెచ్‌ విజయరథం యాత్ర రాత్రి నర్సాపూర్‌కు చేరుకుంది. అక్కడ ఆయన మాట్లాడుతూ, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్‌ కుటుంబం నాంపల్లి దర్గా వద్ద అడుక్కు తినాల్సి వచ్చేదని    విమర్శించారు.

మరిన్ని వార్తలు