అప్పుడాయన పొగిడారు కానీ.. ఇప్పుడైతేనా?

17 Aug, 2018 05:06 IST|Sakshi

న్యూఢిల్లీ: అది 70వ దశకం. అటల్‌జీ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఢిల్లీలోని సౌత్‌ బ్లాక్‌లో నెహ్రూ చిత్రపటం కనబడలేదు. వెంటనే కల్పించుకున్న అటల్‌.. దాన్ని అక్కడే తిరిగి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ విషయాన్ని పార్లమెంటు భేటీలోనూ ప్రస్తావించారు. ‘కాంగ్రెస్‌ మిత్రులు ఇది నమ్మకపోవచ్చు. సౌత్‌ బ్లాక్‌లో నేను వెళ్లే దారిలో నెహ్రూ చిత్రపటం ఉండేది. కానీ అకస్మాత్తుగా అది కనబడకుండా పోయింది’ అంటూ సభలో ప్రస్తావిం చారు. ‘సిబ్బందిని అడిగాను. ఆ పటం ఏదని. వారి నుంచి సమాధానం రాలేదు. తర్వాత మళ్లీ దాన్ని ఆ స్థానంలోనే పెట్టారు’ అన్నారు. దీంతో సభ ఒక్కసారిగా చప్పట్లతో మారుమోగింది. ఇతరుల విమర్శలనూ స్వీకరించే గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి నెహ్రూ అంటూ పొగిడారు అటల్‌జీ. ‘విన్‌స్టన్‌ చర్చిల్, నెవిలే చాంబర్లీన్‌ల వ్యక్తిత్వాలు కలబోసిన వ్యక్తి నెహ్రూజీ అని ఓ సారి విమర్శించాను. దానికి ఆయన ఏమాత్రం కలత చెందలేదు. సాయంత్రం ఆయన్ను కలసినపుడు చాలా బాగా మాట్లాడావని పొగిడారు. ఇప్పుడలాంటి విమర్శలు చేస్తే నాతో మాట్లాడటమే మానేస్తారు’ అన్నారు. 

మరిన్ని వార్తలు