మహిళలు, యువత మద్దతు జగన్‌కే..

9 Apr, 2019 12:50 IST|Sakshi

వారి సంక్షేమమే ధ్యేయంగా పలు పథకాలు ప్రకటించిన వైఎస్సార్‌సీపీ అధినేత

మద్య నిషేధం, అమ్మ ఒడి, వైఎస్సార్‌ ఆసరా తదితర         పథకాలతో మేలు

వైఎస్సార్‌సీపీ అనకాపల్లి పార్లమెంట్‌ ఎన్నికల

సమన్వయకర్త వరుదు కల్యాణి  

అక్కచెల్లెమ్మల కష్టాలు ఎరిగిన నేత వైఎస్‌ జగన్‌. అందుకే వారి కోసం పలు పథకాలు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని అమలు చేయనున్నారు. పేద, మధ్య తరగతి ప్రజల ఇల్లు గుల్ల చేస్తున్న మద్యం మహమ్మారిని రాష్ట్రం నుంచి తరిమేసి, ఆడపడుచులను ఆదుకోడానికి మద్య నిషేధం అమలు చేయనున్నారు. డ్వాక్రా అక్క చెల్లెమ్మల కోసం వైఎస్సార్‌ ఆసరా, పేద తల్లుల కోసం వైఎస్సార్‌ అమ్మఒడి పథకాలు అమలు చేయనున్నారు. వైఎస్సార్‌ గృహ నిర్మాణ పథకం కింద మంజూరైన ఇళ్లను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల భర్తీకి కూడా ఆయన హామీ ఇవ్వడంతో  మహిళలు, యువత జగనన్నకే మద్దతు పలుకుతున్నారని ఆ పార్టీ అనకాపల్లి పార్లమెంట్‌ జిల్లా ఎన్నికల సమన్వయకర్త వరుదు కల్యాణి తెలిపారు. ఆమెతో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ...

సాక్షి: నవరత్నాల’కు ప్రజాధారణ ఎలా ఉంది ? వాటిని ప్రజల్లోకి ఎంతమేర తీసుకెళ్లగలిగారు ?  
వరుదుకల్యాణి: వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షించాయి.
పార్టీలో బూత్‌ కమిటీలు ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రజల్లోకి త్వరగా, వంద శాతం తీసుకెళ్లాం. నవరత్నాలకు ప్రజలలో విశేషస్పందన వచ్చింది. ఇది మా తొలివిజయంగా భావిస్తున్నాం.

సాక్షి: మీ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ‘మద్యనిషేధం’ అమలు చేస్తామని  హామీ ఇచ్చా రు. దీనిపై మహిళల స్పందన ఎలాగుంది ?  
వరుదుకల్యాణి:పేద, బడుగు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా మద్యానికి బానిసలవుతుండడంతో వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అప్పుల కారణంగా ఇల్లు గుల్లవడంతో పాటు, ఆరోగ్యం క్షీణించడంతో   మహిళలు భర్తలను కోల్పోతున్నారు.  టీడీపీ ప్రభుత్వంలో లిక్కర్‌ మాఫియా మరింత పెరిగిపోయింది. మహిళ వెతలు గమనించిన జగన్‌ మద్యపానాన్ని నిషేధిస్తామని ప్రకటించారు. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  టీడీపీ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న మహిళలంతా వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేస్తారు.  

సాక్షి: ‘పసుపు–కుంకుమ’ పథకంపై డ్వాక్రా సభ్యుల స్పందన ఎలాగుంది ?  
వరుదుకల్యాణి:మహిళలంతా చాలా తెలివిగా ఆలోచిస్తారు. చంద్రబాబు డ్వాక్రా రుణాలు రద్దు చేయకుండా మాయచేయడంతో చాలా మందికి బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో  తీవ్ర అవమానాలకు గురయ్యారు.ఇప్పుడు ఎన్నికల ముందు పసుపుకుంకుమ పేరుతో మరోసారి మోసం చేయనున్నారని మహిళలంతా ముందుగానే గ్రహించారు.  చంద్రబాబు ఎన్ని గిమ్మిక్కులు చేసినా తగిన బుద్ధి చెప్పడం ఖాయం.

సాక్షి: ప్రజాసంకల్పయాత్రలో అనకాపల్లి పార్లమెంట్‌సమన్వయకర్తగా ప్రాంతీయ సమస్యలను మీ అధినాయకుడు దృష్టికి తీసికెళ్లారా..?
వరుదుకల్యాణి:  ప్రజాసంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని  వర్గాల ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకున్నారు. మరికొన్ని సమస్యలను నేను  నేరుగా మా నాయకుడు దృష్టికి  తీసుకెళ్లాను. అధికారం వచ్చిన వెంటనే ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధానంగా సహకారంగంలో ఉన్న సుగర్‌ ఫ్యాక్టరీలను మొదటిగా తెరిపిస్తానన్నారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

సాక్షి: ఈ ఎన్నికల్లో యువత, నిరుద్యోగులు ఏ పార్టీవైపు ఉంటారు..?జనసేన ప్రభావం ఉంటుందా..?
వరుదుకల్యాణి: ఈ ఎన్నికల్లో యువత, నిరుద్యోగులు వైఎస్సార్సీపీకే ఓట్లు వేస్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి, పది మందిని నియమించనున్నారు. పథకాల అమలుకోసం ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ, ప్రభుత్వ ఉద్యోగాలకు రోస్టర్‌ విధానం అమలు, స్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్ల ఏర్పాటు తదితర హామీలతో యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అందువల్ల ఆ అవకాశాన్ని వారు చేజార్చుకోరు.  యువతపై జనసేన ప్రభావం ఉండదు.  పవన్‌కల్యాణ్‌ను సినిమాల వరకే అభిమానిస్తామని, మా భవిష్యత్‌ నిర్ణయించే వైఎస్సార్‌సీపీకి ఓట్లు  వేస్తామని  యువత చెబుతున్నారు.  

సాక్షి: విశాఖ జిల్లాలో త్రిముఖ పోరు ఉంటుందని మీరు భావిస్తున్నారా..?
వరుదుకల్యాణి: ఎట్టి పరిస్థితుల్లో త్రిముఖ పోరు ఉండదు.  వైఎస్సార్సీపీకి, టీడీపీ పార్టీల మధ్యనే ప్రధాన పోరు ఉంటుంది. అందులో అత్యధిక స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలో పడతాయి. మా పార్టీ అభ్యర్థులు మంచి మెజార్టీతో విజయం సాధిస్తారు.

మరిన్ని వార్తలు