‘నీకు అంత డబ్బు ఎక్కడిది?’

24 Feb, 2020 20:56 IST|Sakshi

సాక్షి, కృష్ణా: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నాయకుడు దేవినేని ఉమపై మాజీ హోంశాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు ఫైర్‌ అయ్యారు. మూడు రాజధానులకు మద్దతు తెలిపినందుకు దేవినేని ఉమ.. వసంత నాగేశ్వరరావు, ఆయన కుమారుడు వసంత కృష్ణ ప్రసాద్‌పై విమర్శలు గుప్పించారు. వీటిపై సోమవారం ఆయన స్పందిస్తూ.. అన్నయ్య పేరు చెప్పుకుని బతికే ఆయన కృష్ణ ప్రసాద్‌ను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం అన్నయ్య పేరు చెప్పుకుని రాజకీయంగా ఎదిగి.. నేడు అన్నయ్య కూతుర్లను సరిగ్గా చూసుకోలేని అసమర్థుడని విమర్శించారు. ప్రజల సొమ్ముతో బతికే అతనికి నీతినిజాయితీలు లేవని.. అందుకే ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ అతని ఇంటికి వెళ్లరని ఎద్దేవా చేశారు.

‘నువ్వు ఐదుసార్లు ఎన్నికల్లో పోటీ చేశావు.. మరి నీకు అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు హైదరాబాద్‌లో ఉన్న ఆస్తుల విలువ ఎంత? ఎందుకని నువ్వు ఆస్తి వివరాలు ప్రకటించడం లేదు?’ అంటూ ఆయన వరుస ప్రశ్నలు సంధించారు. ‘పోలవరంలో నువ్వు చేసిన అవినీతి అంతా ఇంతా కాదు. త్వరలోనే నువ్వు జైలుకు వెళ్లడం ఖాయం. డబ్బులు ఉంటే ఇబ్బంది అవుతుంది అని తెలిసి వజ్రాలు కొని దాచుకుంటున్నావు. నువ్వు ఎంత నీతిమంతుడివో నీ ఇంట్లో సూట్కేస్ తెరిస్తే అర్థమవుతుంది. దాదాపు సగం మంది టీడీపీ ఎమ్మెల్యేల అవినీతి సొమ్ము మొత్తం వజ్రాల రూపంలో మీ ఇంట్లోనే ఉంది’ అని వసంత నాగేశ్వరరావు విమర్శించారు.(ఎంపీ సురేష్‌పై టీడీపీ నేతల దాడి)

మరిన్ని వార్తలు