మహిళలను పావులుగా వాడుకోవడం టీడీపీకి తగదు

12 Jan, 2020 18:25 IST|Sakshi

సాక్షి, విజయవాడ: మహిళలను రాజకీయ క్రీడా చదరంగంలో పావులుగా వాడుకోవడం తెలుగుదేశం పార్టీకి తగదని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. జాతీయ మహిళా కమిషన్‌ సభ్యులను టీడీపీ తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిందని ఆమె వ్యాఖ్యానించారు. కమిషన్‌ సభ్యులకు అడుగడుగునా టీడీపీ ఆటంకాలు సృష్టించిందని వాసిరెడ్డి పద్మ అన్నారు. పథకం ప్రకారం మహిళలపై అరాచకాలు జరుగుతున్నట్లు చెప్పేందుకు ప్రయత్నించిందన్నారు.

లేనిదాన్ని ఉన్నట్లు చెప్పించడం టీడీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. సోషల్‌ మీడియాలో టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని, ఎక్కడో జరిగిన సంఘటనలను ఇక్కడవంటూ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారన్నారు. జీతాలు పెంచాలంటూ ధర్నాలు చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన ఘటన చంద్రబాబుది అని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు