సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలకు హద్దే లేకుండా పోయిందని, అంకెలతో గారడీ చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. ఆమె బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబు అబద్ధాలకు హద్దే లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.
అపోలో టైర్స్ పరిశ్రమపై ముఖ్యమంత్రి మంగళవారం చేసిన ప్రకటనతో పాటు రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, ఉద్యోగాలు, జీడీపీ లెక్కలు, వీటితో పాటు చంద్రబాబు కుటుంబ ఆస్తుల ప్రకటనల్లో కూడా ఎక్కడా వాస్తవం కనిపించటం లేదని మండిపడ్డారు. 2022 నాటికి ఏపీ దేశంలోని మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటుందని, 2019 నాటికి నంబర్ 1గా ఉంటుందని, 2050 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1గా ఉంటుందని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు.
ఈ పిచ్చి మాటలను ఆయన దార్శనికతకు నిదర్శనంగా మళ్లీ మీడియాలో రాయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనుల అవకతవకలపై సీబీఐ విచారణకు చంద్రబాబు సిద్ధమా? అని బహిరంగ సవాల్ను విసిరారు. సీబీఐ విచారణ జరిగితే చంద్రబాబు జైలుకు వెళ్లాల్సి వస్తుందని స్పష్టంచేశారు.