ఉప ఎన్నికలోస్తే.. బంపర్‌ మెజారిటీ!

6 Jun, 2018 14:51 IST|Sakshi

తణుకు (పశ్చిమ గోదావరి జిల్లా) : ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం 14 నెలల ముందే ఎంపీ పదవులను తృణప్రాయంగా త్యాగం చేయడం అభినందనీయమని, హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడింది ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఉప ఎన్నికలు వస్తే బంపర్‌ మెజారిటీతో తమ ఎంపీలు గెలుపొందుతారని తెలియజేశారు. దమ్మంటే ఉప ఎన్నికలను ప్రత్యేక హోదా రిఫెరెండమ్‌గా భావించి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని సవాలు విసిరారు. ఆ పార్టీ ఎంపీల రాజీనామాను లోక్‌సభ స్పీకర్‌ ఆమోదించిన సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె తెలుగుదేశం ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

పద్మ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పోరాటంలో అంతిమ అస్త్రంగా ఎంపీలు రాజీనామా చేస్తారని రెండేళ్ల కిందనే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉండబట్టే లోక్‌సభ స్పీకర్‌ను పదే పదే కలిసి తమ నాయకులు రాజీనామాలను ఆమోదింపజేసుకున్నారని తెలిపారు.  ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులు వదులుకునేందుకు తమ పార్టీ నాయకులు చేసిన రాజీనామాలను చులకన చేసి మాట్లాడిన చంద్రబాబు ఐదు కోట్ల ఆంధ్రులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు.

ఆయనకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని, 29 సార్లు ఢిల్లీ వెళ్లానన్న చంద్రబాబు హోదాను నీరుగార్చింది నిజంకాదా అని​ ప్రశ్నించారు. తమ పార్టీ ఎంపీల రాజీనామా ఆమోదం తర్వాతనైన చంద్రబాబు సిగ్గుపడి వారి పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించాలని కోరారు. పైకి ఎన్డీయే కూటమి నుంచి బయటికోచ్చానని చెప్పుకుంటున్న బాబు ఇంకా బీజేపీతో చీకటి ఒప్పందాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం నిజాయితీగా పోరాటం చేసేది ఎవరో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

మరిన్ని వార్తలు