నీకు రూ.వేల కోట్ల ఆస్తులెలా వచ్చాయి బాబూ?

25 Mar, 2019 04:51 IST|Sakshi

ప్రజలకు సమాధానం చెప్పాలని 

వైఎస్సార్‌సీపీ నేత వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడు చంద్రబాబు.. ఆ విషయం టీడీపీ నాయకుడు జూపూడి ప్రభాకర్‌కు తెలియకపోవడం ఆశ్చర్యకరమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె ఆదివారం హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు ఆస్తులు ఎలా వచ్చాయో, చంద్రబాబు ఆస్తులు ఎలా పెరిగాయో యూట్యూబ్‌లో పాత వీడియోలు చూసి పరిజ్ఞానం పెంచుకోవాలని జూపూడికి సూచించారు. రూ.1,000 కోట్లకుపైగా చూపిస్తున్న ఆస్తులు, చూపించని రూ.వేల కోట్ల ఆస్తుల 2 ఎకరాల నుంచి ఎలా పెరిగాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు అధికారంలోకి వస్తే హెరిటేజ్‌ లాభాల్లోకి వస్తుంది, అధికారంలో లేకపోతే లాభాలు తగ్గుతాయని, దీని వెనకున్న మర్మమెంటో చంద్రబాబు వివరించాలని పేర్కొన్నారు. 2014లో హెరిటేజ్‌ షేర్‌ ధర రూ.300 ఉండగా, 2017లో రూ.1,303కి ఎగబాకిందని గుర్తు చేశారు. రాజధానిలో చంద్రబాబు బినామీలు ఏ డబ్బుతో భూములు కొన్నారో సమాధానం చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనడానికి, వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌పై గెలిచిన ఎమ్మెల్యేలను కొనడానికి, కర్ణాటక ఎన్నికలకు పంపిన సొమ్ము, మొన్నటి తెలంగాణ ఎన్నికలల్లో కాంగ్రెస్‌ పార్టీకి ఇచ్చిన డబ్బు ఎక్కడిదో చెప్పాలని చంద్రబాబును నిలదీశారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ చేరవేస్తున్న డబ్బుల మూటలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రజలకు వివరించాలన్నారు. చంద్రబాబు ఆస్తులపై బహిరంగ విచారణకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందన్నారు.    

మరిన్ని వార్తలు