వీరప్పన్‌ కుమార్తెకు బీజేపీలో కీలక పదవి

19 Jul, 2020 14:14 IST|Sakshi
విద్యా వీరప్పన్‌ (ఫైల్‌ఫోటో)

సాక్షి, చెన్నై : ఒకప్పుడు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలను గడగడలాడించిన గంధపు చెక్కల స్మగ్లర్, అడవి దొంగ వీరప్పన్‌ కూతురు విద్యా వీరప్పన్‌కు బీజేపీ కీలక బాధ్యతలను అప్పగించింది. తమిళనాడు యువమోర్చా విభాగం ఉపాధ్యక్షురాలిగా ఆదివారం ఆమెను నియమించింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన విద్య గత పిబ్రవరిలో తన అనుచరులతో కలిసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి సమయం దగ్గర పడుతున్న తరుణంలో  వీరప్పన్ వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగానే విద్యకు రాష్ట్ర స్థాయిలో పదవిని కట్టబెట్టారు. మరోవైపు పాత వీరప్పన్‌ వర్గాన్ని మొత్తం బీజేపీ వైపుకు తిప్పలా విద్య కీలకంగా వ్యవహరిస్తున్నారు. కాగా గంధపు చెక్కల స్మగ్లర్‌గా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వీరప్పన్‌ 2004లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు