‘నీచ రాజకీయాలు మానుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు’

6 Apr, 2020 11:56 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ప్రజలకు కష్టాల్లో అండగా నిలవాల్సిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్‌లో సినిమా షూటింగ్‌లు చేసుకుంటున్నాడని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విమర్శించారు. ప్రజలు రేషన్‌ షాప్‌ వద్ద సరుకులు తీసుకున్నప్పుడు కామెంట్‌ చేసిన పవన్‌కు.. బ్యాంకుల వద్ద జనం క్యూలో నిల్చున్నవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. విజయవాడ భవానీపురం 40వ డివిజన్‌లో యరడ్ల ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం 5వేల కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పాల్గొని పేదలకు సరుకులు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా నియంత్రణకు కృషి చేస్తున్నారని తెలిపారు. (కరోనాపై గెలిచిన బాలీవుడ్ గాయ‌ని)

ప్రజలకు ఆరోగ్యం, శానిటేషన్‌, తాగునీటి సమస్యలు లేకుండా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. నేరుగా ప్రజలకు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ మా డబ్బు.. మా డబ్బు అంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 1300 కోట్లు జీవో విడుదల చేశారని ఆయన గమనించాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ ఇచ్చేవి జన్‌ధన్‌ పథకంలో వేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో కరోనా కట్టడికి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టామని తెలిపారు. సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకే చేరవేస్తున్న ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అని ప్రశంసించారు. ప్రతిపక్షాలు పనికిమాలిన విమర్శలు మానుకొని.. ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు రావాలని మంత్రి హితవు పలికారు. (భయపడితేనే ప్రాణాలు కాపాడుకోగలం: సల్మాన్‌ )

వైఎస్సార్సీపీ కార్యకర్తలు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవ చేస్తున్నారని గుర్తు చేశారు. కమ్యూనిస్ట్‌ జెండా అడ్డు పెట్టుకుని బతికే వ్యక్తి రామకృష్ణ.. ప్రజలకు సేవ చేసే వారిని అవమానించడం మానుకోవాలని సూచించారు. డాక్టర్లు, శానిటేషన్‌ సిబ్బంది, పోలీసులతో కలిసి కార్యకర్తలు కూడా తమవంతు సేవ చేస్తున్నారని ప్రస్తావించారు. వారిపై అవాకులు, చవాకులు మానుకోవాలని హెచ్చరించారు. నీచ రాజకీయాలు మానుకోకుంటే ప్రజలే మరోసారి బుద్ధి చెబుతారని అన్నారు. కరోనాపై ప్రజల్లో అవగాహన పెరగాలని, లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఇళ్లకే పరిమితమవ్వాలని కోరారు. ప్రభుత్వం నేరుగా ఇంటి వద్దకే సంక్షేమ ఫలాలు అందిస్తోందని, ప్రభుత్వానికి సహకరిస్తే కరోనాను రాష్ట్రం నుంచి తరిమికొట్టవచ్చని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. (బీజేపీ కార్యకర్తలందరూ ఆ పని చేయండి: మోదీ)

మరిన్ని వార్తలు