బాబూ.. నువ్వు, నీ బినామీలు జైలుకే..

7 Apr, 2019 01:36 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టీకరణ  

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌లో నాపై దుష్ప్రచారం  

ఎన్నికల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేస్తా  

ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ను మూసివేయాలి

సమాజానికి పట్టిన చీడ పురుగు రాధాకృష్ణ  

చంద్రబాబుతో కలిసి ఆయన దోచుకున్న ప్రతి పైసా కక్కిస్తాం...  

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని, తమ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించడం తథ్యమని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. ఈ విషయం సీఎం చంద్రబాబుకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు పూర్తి అర్థమైందని, అందుకే వైఎస్సార్‌సీపీ నేతలపై దుష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఐదేళ్లుగా చేసిన దోపిడీలకు సహకరించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ లాంటి వ్యక్తులు కూడా బాబుతోపాటు జైలుకు వెళ్తారని, అందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తనకు సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌లో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిని, ఏపీ ప్రజలను తాను కించపరిచినట్లుగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ విషప్రచారం చేస్తోందని, దీనిపై ఈసీకి, సీఈసీకి, పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పాత్రికేయ విలువలను తుంగలో తొక్కుతున్న ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌ను మూసివేయాలని ఫిర్యాదు చేస్తామన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. సమాజానికి పట్టిన చీడ పురుగు రాధాకృష్ణ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  
ఏపీ ప్రభుత్వం నుంచి

ఆంధ్రజ్యోతికి రూ.1,500 కోట్లు  
‘‘చంద్రబాబు మాత్రమే కాదు.. గత ఐదేళ్లుగా దోపిడీకి సహకరించిన వారిలో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఒక భాగస్వామి. చంద్రబాబుతోపాటు రాధాకృష్ణ లాంటి వ్యక్తులు జైలుకు వెళ్తారు. అధికారం చేజారుతుందని చంద్రబాబు రోజురోజుకీ అసహనానికి లోనవుతున్నాడు. అందుకే రాధాకృష్ణ తప్పుడు వార్తలు రాస్తే.. మరుసటి రోజే చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో వాటి గురించి మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఏబీఎన్‌ చానల్, ఆంధ్రజ్యోతి పత్రికకు రూ.1,500 కోట్ల విలువైన ప్రకటనలు వచ్చాయి. ఇదికాకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరో రూ.1500 కోట్ల సెటిల్‌మెంట్లు రాధాకృష్ణ చేశాడు’’అని విజయసాయిరెడ్డి ఆరోపించారు.  

ఆంధ్రజ్యోతి కులజ్యోతి మాత్రమే  
‘‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌లో నాపై తప్పుడు ప్రచారం చేశారు. మా పార్టీ అధ్యక్షుడి గురించి, ఏపీ ప్రజల గురించి కించపరుస్తూ మాట్లాడిన్నట్లుగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌లోనే వచ్చింది. కుట్రపూరితంగా దీన్ని ప్రసారం చేశారు. నేను ఏ రోజూ అలా మాట్లాడను. ఆ వాయిస్‌లోని కొన్ని పదాలు నాకు తెలియవు. అస్ట్రేలియాలోని ఓ వ్యక్తి ద్వారా మాట్లాడించి నాకు అంటగట్టారు. ఆ విషయాన్ని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నిర్థారిస్తుంది. ఆంధ్రజ్యోతి కులజ్యోతి మాత్రమే. అది ఒక కులానికి కొమ్ముకాస్తున్న పత్రిక. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గతంలో కిరోసిన్, రేషన్‌ బియ్యం దొంగ. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. రాధాకృష్ణ నిజమైన జర్నలిస్టు అయితే ఆయన చానల్‌లో నాపై ప్రసారం చేసిన అంశాలను నిరూపించాలి.

టీడీపీ ప్రయోజనాల కోసమే ఈ న్యూస్‌ ప్రసారం చేశారు. నిన్న లక్ష్మీపార్వతిపై, నేడు నాపై దుష్ప్రచారం చేశారు. రేపు ఇంకొక వైఎస్సార్‌సీపీ నేతపైనా ఇలాగే చేస్తారు. రాధాకృష్ణ ఒక కులానికి నాయకుడు. కుల పిచ్చి ఉన్న వ్యక్తి. సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని వ్యక్తి. తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయిన బాడుగ నేత రాధాకృష్ణ. చంద్రబాబుతో కలిసి ఆయన దోచుకున్న ప్రతి పైసాను కక్కిస్తాం. ఇక్కడ దుష్ప్రచారం చేశారు కాబట్టి ఇక్కడి పోలీసులకు కూడా రాధాకృష్ణపై ఫిర్యాదు చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం ఖాయం’’అని విజయసాయిరెడ్డి వెల్లడించారు.  

మరిన్ని వార్తలు