ఓహో.. అందుకే లోకేష్‌ రాజీనామా చేయలేదా!

20 Mar, 2019 09:32 IST|Sakshi

తండ్రికొడుకులిద్దరికి ఓటమి భయం పట్టుకుంది

ట్విటర్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, హైదరాబాద్‌ : మంగళగిరిలో గెలుపుపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్‌లకు నమ్మకం లేదని, అందుకే ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా లోకేష్‌ పోటీచేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు. ఓడిపోతే మళ్లీ ఎమ్మెల్సీగా కోనసాగుతారని, నారాయణ, సోమిరెడ్డిలాగా కొడుకును ఎందుకు రాజీనామా చేయించలేదు చంద్రబాబు.. అని ప్రశ్నించారు. ట్విటర్‌ వేదికగా టీడీపీ-జనసేనల రహస్య ఒప్పందంపై విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.

నీకిది-నాకది థీరీని కనిపెట్టినవాడు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణని, అప్పట్లో కుల మీడియా ఈ థీరీని ఊరూవాడా  ప్రచారం చేసిందన్నారు. జేడీ జనసేనలో చేరిన వెంటనే ఆ థీరీని మరోసారి ఆచరణలోకి తెచ్చారని, నీకిది-నాకది అంటూ టీడీపీ-జనసేన మధ్య ఫ్రెండ్లీ పోటీకి డీల్‌ కుదిరిందని ఆరోపించారు. ఈ ఇద్దరి ఉమ్మడి ప్రత్యర్ధి మాత్రం వైఎస్‌ జగనేనన్నారు. ‘అలెగ్జాండర్ భారత్‌ దండయాత్ర వెనుక ఒక విలన్‌ ఉన్నాడు. అతడే తక్షశిల రాజు అంభి. పురుషోత్తముడిపై పగతో రగిలే అతను అలెక్స్‌తో చేతులు కలిపి జీలం యుద్ధంలో పురుషోత్తముడి  ఓటమికి కారకుడయ్యాడు. ఇప్పుడు వైఎస్ జగన్‌ను దొంగ దెబ్బ కొట్టడానికి చంద్రబాబు అంభితో ప్యాకేజి డీల్ చేసుకున్నారు.’ అని మండిపడ్డారు.

దండయాత్రలు, యుద్ధాలతో విసిగిపోయిన గ్రీకు సేనలు చివరకు అలెగ్జాండర్‌నే ధిక్కరించాయన్నది చరిత్ర చెబుతున్న సత్యమని, ముఠాలు, కుమ్ములాటలు, తిరుగుబాట్లతో ఎన్నికల కురుక్షేత్రంలో సొంత సైన్యమే తన కొంప ముంచబోతుందన్న వాస్తవం ‘అభినవ అలెగ్జాండర్‌’ చంద్రబాబుకు ఈ పాటికి బోధపడే ఉండాలన్నారు. 25 ఎంపీ స్థానాల్లో తమ అధినేత వైఎస్‌ జగన్‌ 7 సీట్లకు బీసీ అభ్యర్ధులను నిలబెడితే.. ఈ  బీసీలే మాకు వెన్నెముక అని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నచంద్రబాబు మాత్రం వారికి 5 ఎంపీ స్థానాలు మాత్రమే ఇచ్చారన్నారు. బీసీల అభ్యున్నతి పట్ల ఎవరి చిత్తశుద్ధి, నిజాయితీ ఏమిటో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు