గెలుపే లక్ష్యంగా పని చేయాలి: విజయసాయి రెడ్డి

7 Mar, 2020 18:48 IST|Sakshi

సాక్షి, శ్రీకాకుళం : స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పని చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ...స్థానిక ఎన్నికలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడంచెల ప్రక్రియ నిర్ణయించారన్నారు. (ఏపీ: ‘స్థానికఎన్నికల షెడ్యూల్ విడుదల)

ఎన్నికల్లో అందరూ సమన్వయంతో వ్యవహరించాలని విజయసాయి రెడ్డి సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించగలిగితే చాలని... ప్రతిపక్షానికి భయపడాల్సిన పని లేదని, రాష‍్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. టెక్కలి ఎమ్మెల్యే అసెంబ్లీలో వ్యవహరిస్తున్న తీరు ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్లాలని విజయసాయి రెడ్డి అన్నారు. అలా చేస్తే అచ్చెన్నాయుడు, ఆయన పార్టీ తుడుచుపెట్టుకుపోతుందన్నారు. (నారా వైరస్కు వ్యాక్సిన్ కనిపెట్టేశారు..)

చంద్రబాబువి చిల్లర మాటలు..
పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. ‘బీసీలకు 59 శాతం రిజర్వేషన్‌ కల్పించి, ఎన్నికలకు వెళ్లాలని అనుకున్నాం. అయితే టీడీపీ కుట్రపూరితంగా కోర్టుకు వెళ్లి అడ్డుకుంది. ఈ నెలాఖరులోగా ఎన్నికల నిర్వహణ జరగకపోతే రాష్ట్రానికి రావాల్సిన 5వేల కోట్ల రూపాయలు ఆగిపోతాయి. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ డ్రామా ఆర్టిస్టులు. ఎల్లో మీడియాలో ఏదో ఒక వార్త వస్తుంది. అది చూసి చంద్రబాబు మొదలు టీడీపీ నాయకులు అంతా రోడ్డెక్కుతారు. తెలుగుదేశం పార్టీ డ్రామా కంపెనీ. చంద్రబాబువి అన్ని చిల్లర మాటలు. ఆయన మనిషిగా సమాజంలో ఉండాల్సిన వ్యక్తి కాదు.

రాజధాని మార్చారంటే ఊరుకోను అని చంద్రబాబు అంటున్నారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లుగా మొన్న విశాఖ విమానాశ్రయంలో ఆయనను ప్రజలు ఛీ కొట్టారు. ఉత్తరాంధ్ర ప్రజలను బాబు ప్రతీసారి మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా మారకపోతే చంద్రబాబుతో పాటు ఆయన తుప్పుపట్టిన సైకిల్‌ను ప్రజలు తుక్కు తుక్కుగా కొడతారు’ అని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో మంత్రి కృష్ణదాస్‌, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, కిరణ్‌కుమార్‌, కళావతి, పార్టీ నేతలు పాల్గొన్నారు. (బాబు వల్లే సీట్ల కోత)

మరిన్ని వార్తలు