ఏ రాష్ట్రంలోనైనా టీడీపీని చిత్తుగా ఓడించాలి 

6 Dec, 2018 04:57 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే కాదు.. ఏ రాష్ట్రంలో పోటీ చేసినా టీడీపీని చిత్తుగా ఓడించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం ట్విట్టర్‌లో పిలుపునిచ్చారు. వెన్నుపోటు, వంచన, నమ్మకద్రోహానికి టీడీపీ మారుపేరని విమర్శించారు. గొర్రెల మందలో దూరిన తోడేలులా అధికారం కోసం ఎలాంటి అడ్డదారులనైనా తొక్కుతూ, అవసరాన్ని బట్టి రంగులు మార్చే రాజకీయ దళారి చంద్రబాబుకు బ్యాలెట్‌తోనే గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు.

మీరేదో సాధించినట్టు తెలంగాణపై ఆవేదనా.. 
ఏపీలో తాను మిగులు బడ్జెట్‌ సాధించినట్లు తెలంగాణ అప్పుల పాలైందని తెగ ఆవేదన వ్యక్తం చేయడం ఏమిటని చంద్రబాబును విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలో చంద్రబాబు పాలన దారుణంగా ఉందని, నాలుగేళ్ల బందిపోటు పాలనలో ఏపీ అప్పులు రెండున్నర లక్షల కోట్లకు చేరాయని పేర్కొన్నారు.  

ఏపీలోనూ ఆ మాట అనగలరా?
ఫ్రస్టేషన్‌ పీక్‌కు చేరడంతో చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.  కాంగ్రెస్‌ను వదిలేసి బీజేపీ వైపు వెళుతున్నట్లు సంకేతాలిస్తున్నారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. పార్టీలు ఫిరాయించిన వారిని గల్లంతు చేయాలని తెలంగాణలో పిలుపునిచ్చిన చంద్రబాబు ఆ మాట ఏపీలోనూ అనగలరా? అని నిలదీశారు.  వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. ఫిరాయింపుదారుల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజేయ కల్లాం చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించే ధైర్యముందా? అని ప్రశ్నించారు.  

మరిన్ని వార్తలు