సానుభూతి డ్రామాలాడటం పరువు తీసుకోవటమే

23 Jun, 2019 12:09 IST|Sakshi

సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ నాయకులపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. ప్రజావేదిక విషయంలో టీడీపీ నాయకులు ఆడుతున్న డ్రామాలను ఆయన తప్పుబట్టారు. ‘ప్రజావేదిక’ ప్రభుత్వ నిధులతో నిర్మించిన సదుపాయమని, చంద్రబాబు దానిని పార్టీ కార్యక్రమాలకు వాడుతున్నారని తెలిపారు. ఓడిపోయినా తన ఆక్రమణలోనే పెట్టుకున్నారని అన్నారు. ప్రజావేదికను కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు సిద్ధం చేస్తుంటే బాబు లేనపుడు తాళాలు తీస్తారా అంటూ ఆ పార్టీ నాయకులు సానుభూతి డ్రామాలాడటం పరువు తీసుకోవడమేనన్నారు. పోలవరం పనుల అంచనాలను ఎలా తగ్గిస్తారో చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమా అనడం.. దమ్ముంటే తనను పట్టుకోమని దొంగ పోలీసులకు సవాలు విసిరినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. అన్ని అనుమతులుండి, పనులు మొదలైన ప్రాజెక్టును ఐదేళ్లు ఏటీఎంలాగా వాడుకున్నారని మండిపడ్డారు.

‘మీ దోపిడీలన్నీ బయటకొస్తాయి. ఎవరూ తప్పించుకోలేరు ఉమా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఓబీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టామన్నారు. దేశంలోని ఓబీసీలంతా సామాజికంగా ఉన్నత స్థాయికి ఎదగాలని వైఎస్‌ జగన్‌ ఆకాంక్షగా పేర్కొన్నారు. దీనిపై జరిగే చర్చ తప్పని సరిగా వారి అభ్యున్నతికి దారులు వేస్తుందని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు