రాష్ట్ర ప్రజలు అందుకే గుణపాఠం చెప్పారు
వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబువి దుర్మార్గపు రాజకీయాలని అందుకే ఆయనకు రాష్ట్ర ప్రజలు గుణపాఠం చెప్పారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన విశాఖ జిల్లా భీమిలిలో దివీస్ లేబొరేటరీ సమీపంలో ఏడు గ్రామాల్లో 7 వేల మందికి రూ.40 లక్షలతో సమకూర్చిన నిత్యావసర సరుకుల పంపిణీని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజానాయకుడంటే కరోనా వంటి విపత్తులు వచ్చినప్పుడు పక్క రాష్ట్రాలకు పారిపోరన్నారు. చంద్రబాబు తెలంగాణకు వెళ్లిపోవడాన్ని గుర్తు చేశారు.
కరోనా నియంత్రణకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది త్యాగాలు గుర్తించకుండా ప్రభుత్వంపై బురదచల్లే నీచరాజకీయాలు మానుకోవాలన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి ఆయా వర్గాలకు న్యాయం జరగాలన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్యేయమన్నారు. కాగా, నగరంలోని వెంకోజీపాలెంలో ప్రగతి భారత్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరకులు, వలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి, జీవీఎంసీ ఉద్యోగులకు మాస్క్లు, గ్లౌజ్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు.