బీజేపీలో చేరిన ముగ్గురు చంద్రబాబు బినామీలే

22 Jun, 2019 12:43 IST|Sakshi

ట్విటర్‌లో విజయసాయి రెడ్డి

సాక్షి, అమరావతి : ఇటీవల బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు బినామీలేనని వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. తనపై అవినీతి కేసులు పెట్టకుండా రక్షణ కోసమే వారిని పంపించారన్నారు. శనివారం ట్విటర్‌ వేదికగా ఆయన చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తెలయకుండానే ఫిరాయిస్తే వారిని అనర్హులుగా ప్రకటించాల్సిందిగా రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాసేవారని, ఇది 100 శాతం మ్యాచ్‌ ఫిక్సింగేనని విజయసాయి రెడ్డి సందేహం వ్యక్తం చేశారు. నలుగురు టీడీపీ ఎంపీలు పార్టీ మారితే అనుకూల మీడియా చాలా జాగ్రత్తగా, బీజేపీకి ఆగ్రహం తెప్పించకుండా వార్తలు రాసిందన్నారు, రెండేళ్ల నుంచి బీజేపీ, మోదీపైన దుమ్మెత్తి పోసిన మీడియా ఇప్పుడు బాబు తీసుకున్న లైన్‌ను అర్థం చేసుకుందని, ఇక నుంచి బీజేపీని ప్రశంసించే వార్తలొస్తాయని తెలిపారు.

సొంత నిధులతో తెలంగాణ ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసిందని, 45 లక్షల ఎకరాలకు నీరందుతుందని, కానీ కేంద్రం నిధులిచ్చినా ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సగం కూడా నిర్మించలేక పోయారని విమర్శించారు. ఎంత సేపు నిధులను దోచుకోవడం తప్ప పూర్తి చేయాలన్నసంకల్పమే లేదని మండిపడ్డారు.

ఎక్కడికెళ్లారో తెలియదా..
చంద్రబాబు విహార యాత్రకు ఏ దేశం వెళ్లారో ఆ పార్టీ నాయకులకూ తెలియదా? స్విట్జర్లాండ్ వెళ్లారో స్వీడన్‌లో ఉన్నారో చెప్పలేనంత రహస్యమా? అని ప్రశ్నించారు. ఎల్లో మీడియా కూడా యూరప్ నుంచి ముఖ్య నాయకులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారని రాసిందన్నారు. కానీ యూరప్ అనేది దేశం కాదని, 44 దేశాలున్న ఖండమని అందరికీ తెలుసని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
 

>
మరిన్ని వార్తలు