చంద్రబాబు అసలు బాధ అదే!

4 Oct, 2019 15:18 IST|Sakshi

చంద్రబాబు, ఎల్లో మీడియాపై విజయసాయిరెడ్డి సెటైర్స్‌

సాక్షి, అమరావతి : సిగ్గులేని బతుకులు ఎవరివో ఐదుగురి పేర్లు చెప్పమంటే ఆ తండ్రీకొడుకుల పేర్లు మొదట ఉంటాయంటూ చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌లను ఉద్దేశించి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వీరితో పాటు కిరసనాయిలు కూడా తప్పనిసరిగా ఉంటాడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తూ మీ పుత్ర రత్నం పెట్టిన ట్వీట్లు సుమతి శతకాల్లా కనిపిస్తున్నాయా బాబూ అని సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు. ‘సోషల్ మీడియా వాల్స్‌పై ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు పోస్ట్ చేస్తారు. అనాగరిక దూషణలుంటే ఫేస్‌బుక్‌కి ఫిర్యాదు చేయొచ్చు. చంద్ర‘జ్యోతి’ ఎన్ని మంటలు రాజేయాలని చూసినా లాభం లేకుండా పోయిందనేదే సారు అసలు బాధ’ అని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

అదే విధంగా... వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, సీఎం జగన్‌పైన నీచపు రాతలు రాసేందుకు వేల మందిని నియమించి.. 24/7 కాల్ సెంటర్లను నిర్వహించిందెవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘మీ బానిస పత్రికలు, చానళ్లు ఎంత దాచి పెట్టినా సోషల్ మీడియా మీ అరాచకాలన్నిటినీ బయట పెట్టింది. అందుకేనా ఈ ఏడుపు’ అంటూ ఎల్లో మీడియాపై విరుచుకుపడ్డారు. ‘అధికారం కోల్పోయినప్పటి నుంచి చంద్రబాబు తీవ్ర మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారు. తనను అందరూ మర్చిపోతున్నారనే భయం వెంటాడుతోంది. పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని రాయించినా సీఎం జగన్‌ స్పందించక పోవడంతో ఆయనలో నిస్పృహ కట్టలు తెంచుకుంది’ అని ట్విటర్‌ వేదికగా చంద్రబాబు తీరును విమర్శించారు.
 

మరిన్ని వార్తలు