23 తర్వాత వీళ్లని ఎక్కడ దాచాలి?

20 May, 2019 20:24 IST|Sakshi

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్స్‌

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఐటీ గ్రిడ్‌ నిందితుడు అశోక్‌, ఫోర్జరీ కేసు నిందితుడు, టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్‌, కోడికత్తి కేసులో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని రెస్టారెంట్‌ యజమాని హర్షవర్ధన్‌లను 23 ఫలితాల తర్వాత ఎక్కడ దాచాలని చంద్రబాబు తలపట్టుకున్నట్లున్న ఫన్నీ మీమ్‌ను విజయసాయిరెడ్డి షేర్‌ చేశారు. మరో ట్వీట్‌లో చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సెటైరిక్‌గా కామెంట్‌ చేశారు. ఢిల్లీలో చక్రం తిప్పాలని వెళ్లిన చంద్రబాబుకు జాతీయ నేతలు ముఖం చాటేశారని, ఫలితాల తర్వాతే కలవాలని చెప్పారని, దీంతో చంద్రబాబు చక్రాల ఆట ఆడుకుంటున్నారని మరో ఫన్నీ మీమ్‌ను ట్వీటర్‌లో పంచుకున్నారు. అమెరికా రాజకీయాలపై చంద్రబాబు చేసిన కామెంట్లను గుర్తు చేస్తూ సైతం వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.

ఇక అంతకు ముందు.. ‘ప్రజలు ఓటుకు 2 వేలు డిమాండు చేస్తున్నారని చంద్రబాబు శోక సముద్రమయ్యాడు. అసలా సంస్కృతికి పితామహుడివే నువ్వు కదా బాబూ. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనే సంప్రదాయం మొదలు పెట్టిందెవరు? ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన తర్వాత కూడా నీతిమాలిన పనులకు తెగబడ్డావు.’  అని చంద్రబాబుపై ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు