‘తుపాన్‌లను ఒంటిచేత్తో ఆపేసిన చంద్రబాబు’

13 Nov, 2018 11:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచార ఆర్భాటంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఎప్పుడూ తానేదో సాధించానంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు శైలిపై ఆయన ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘రెయిన్‌ గన్‌ పట్టుకుని సీమలో కరువు కంటికి కనిపించకుండా తరిమికొట్టాడు. దండయాత్రతో దోమలపై సంహారం చేసి దోమ కనిపించకుండా చేశాడు. టెక్నాలజీతో సముద్రాలను కంట్రోల్‌ చేశాడు. తుపాన్‌లను ఒంటిచేత్తో ఆపేశాడు. ఆదరణ పనిముట్లతో పేదరికాన్ని తరిమికొట్టి పేపర్లకు ఎక్కాడు నాయుడుబాబు’అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

ప్రలోభాలకు ఆదిగురువు చంద్రబాబు
ప్రలోభాలకు ఆదిగురువు చంద్రబాబు నాయుడని విజయసాయిరెడ్డి విమర్శించారు. కుల వృత్తులలో మెజారిటీ ప్రజలు బీసీలేనని పేర్కొన్నారు. వారి కోసం దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఉచిత విద్య పథకాన్ని చంద్రబాబు అటకెక్కించడంపై మండిపడ్డారు. గతంలో పచ్చ చొక్కాల జేబులు నింపిన ఆదరణ పథకానికి బూజు దులిపి.. కుల వృత్తుల వారికి పనిముట్లు పంపిణీతో పేదరికంపై గెలిచేశామంటూ ప్రచారం మొదలుపెట్టారని చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు