అప్పుడు చేయాల్సిన ‘అతి’ ఇప్పుడేనా బాబూ..!

11 Sep, 2019 15:33 IST|Sakshi

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

సాక్షి, అమరావతి : అవినీతిలో కూరుకుపోయిన పచ్చ నేతల్ని కాపాడుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెగ ఉబలాటపడుతున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఎన్నికల ముందు చేయాల్సిన ‘అతి’ని ఇప్పుడే మొదలు పెట్టారని ట్విటర్‌ వేదికగా విమర్శలు చేశారు. ‘యరపతినేని, కోడెల, దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా అంతా. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులున్నాయని రచ్చ చేసి కొత్త పరిశ్రమలు రాకుండా చంద్రబాబు దొంగల ముఠా కుట్రలు మొదలు పెట్టింది. పల్నాడులో ఐదేళ్లు రౌడీయిజం రాజ్యమేలింది. ఇప్పుడక్కడ ప్రశాంతత నెలకొనడం బాబుకు ఇష్టం లేదని అర్థమవుతోంది’అని పేర్కొన్నారు.
(చదవండి : రెచ్చిపోయిన అచ్చెన్నాయుడు)

‘నిద్ర పట్టనోడు ఇంకా తెల్లారలేదని ఆకాశం వైపు రాళ్లు విసిరిన చందంగా చంద్రబాబు, ఆయన ఎంగిలి మెతుకులు తినే బానిసలు, ఎల్లో మీడియా వ్యవహారం ఉంది. ఎలక్షన్లకు 3 నెలల ముందు చేయాల్సిన ‘అతి’నంతా ఇప్పుడే మొదలు పెట్టారు. చంద్రబాబు చిత్తు చిత్తుగా ఓడిపోయి 100 రోజులే అయింది’అని ట్వీట్‌ చేశారు.

‘చలో ఆత్మకూర్‌’ అందుకేనట..!!
‘ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇన్ని కుట్రలా? జూనియర్ ఆర్టిస్టులతో వరద బాధితుల వేషాలు. పల్నాడు వేధింపుల పేరుతో శిబిరాలు, నాణ్యమైన బియ్యం పైనా ఏడుపులు. వలంటీర్లకు పెళ్లిళ్లు కావని శాపాలు. ఐదేళ్లు ఎలా తట్టుకుంటారు చంద్రబాబు, లోకేష్‌ గారూ’ అని విజయసాయిరెడ్డి అన్నారు. 

 ‘దొంగే దొంగని గోల పెట్టడంలా ఉంటాయి చంద్రబాబు గారి వేషాలు. ఐదేళ్లూ అలాగే చేశాడు. అందుకే ప్రజలు గూబ గుయ్ మనిపించి బయటకు విసిరేశారు. మళ్లీ అవే పాత ట్రిక్కులు ప్లే చేస్తున్నాడు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్నోడు వాళ్ల కోసమే ఛలో ఆత్మకూర్ అంటే నమ్మే అమాయకులుంటారా?’అని ట్వీట్‌ చేశారు.
(చదవండి : మహిళా పోలీసుపై అఖిలప్రియ జులుం)

మరిన్ని వార్తలు