పాలకుడికి మ్యానిప్యులేటర్‌కి తేడా ఇదే..!

11 Jun, 2019 04:10 IST|Sakshi

చంద్రబాబూ తెలుసుకో.. 

వైఎస్సార్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి  

సాక్షి,అమరావతి:‘చంద్రబాబూ.. పాలకుడికి, మ్యానిప్యులేటర్‌కు ఉన్న తేడా ఇదే తెలుసుకో’ అని వైఎస్సార్‌ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి సూచించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్‌ చేశారు. ‘తమ వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ. 6 వేలకు పెంచాలని ధర్నా చేసిన ‘ఆశా’ అక్కా చెల్లెమ్మలపై మహిళా దినోత్సవం రోజునే పోలీసులను ఉసిగొల్పి అప్పటి సీఎం చంద్రబాబు అరెస్టు చేయించాడన్నారు. ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం మందస్తు హామీ ఇవ్వకున్నా వారి వేతనాలను 300 శాతం పెంచుతూ కొత్త ఆశలు నింపారని ఆయన తెలిపారు. పాలకుడికి మ్యానిప్యులేటర్‌కి తేడా ఇదే బాబూ అంటూ విజయసాయి రెడ్డి చురకలంటించారు.
  
బాబు నోట మాటే లేదేం... 
వైఎస్‌ జగన్‌ కేబినెట్లో 60 శాతం మంత్రులు అణగారిన వర్గాలకు చెందిన వారేనని దేశంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదని విజయసాయి రెడ్డి తెలిపారు. ఎన్నికల సమయంలో బీసీలు, కాపులను ఉద్దరిస్తానని కోతలు కోసిన మాజీ సీఎం చంద్రబాబుకు వైఎస్‌ జగన్‌ కేబినెట్‌ కూర్పుపై ప్రశంసించడానికి ఒక్క మాట రావడం లేదన్నారు. సామాజికంగా అణిచివేతకు గురైన వారికి నాలుగు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడంపై ఏ వ్యాఖ్య చేయకుండా చంద్రబాబు నాయుడు ‘మౌనీ బాబా’ అయ్యారన్నారు. 

ప్రధానికి ధన్యవాదాలు ... 
రాష్ట్రాభివృద్ధికి తన సహకారం సదా ఉంటుందని హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి విజయసాయి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. స్పెషల్‌ స్టేటస్‌ సహా ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఆయన తోడ్పాటునిస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని వైఎస్‌ జగన్‌ యజ్ఞంలా చేపట్టిన కార్యక్రమాలకు కేంద్రం బాసటగా నిలవాలని ఆకాంక్షించారు.   

మరిన్ని వార్తలు