సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవశకం మొదలైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. యువకుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో అవినీతికి ఆస్కారం లేని, బాధ్యతాయుత, పారదర్శక ప్రభుత్వం ఏర్పడిందన్నారు. స్వచ్ఛమైన పాలనతో ప్రజల కష్టాలను తొలగించేందుకు ఆయన నిరంతరం శ్రమిస్తారని, ప్రజల ఆకాంక్షలను నేరవేర్చడమే ఆయన ప్రధాన ఎజెండానని తెలిపారు.
ప్రమాణస్వీకారం అనంతరం వైఎస్ జగన్ పెన్షన్ల పెంపుదల ఫైలుపై తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం వైఎస్సార్ పెన్షన్ కానుక పథకాన్ని ప్రారంభించింది. వృద్ధుల పెన్షన్ వయస్సు 65 నుంచి 60 ఏళ్లకు కుదించింది. ఈ మేరకు శుక్రవారం వైఎస్ జగన్ సర్కారు తొలి జీవో విడుదల చేసింది. అర్హులందరికీ జూలై 1 నుంచి కొత్త పెన్షన్ పథకం అందనుంది. ఈ పథకం కింద వృద్ధులకు రూ. 2250, వికలాంగులకు రూ. 3 వేలు, కిడ్నీ బాధితులకు రూ. 10 వేల పెన్షన్ చెల్లిస్తారు.