సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అప్పుల గురించి తాను చెప్పిన సమాచారం నిజమని, సీఎం చంద్రబాబు, బ్రోకరు కలిసి రాష్ట్రాన్ని ఆర్థికంగా ముంచేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. ‘రాష్ట్రం అప్పుల గురించి నేను చెప్పిన సమాచారం నిజం.. బాబు, బ్రోకరు కలిసి ముంచేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ రెండింటిలోనూ దొంగ లెక్కల నిపుణుడిని పెట్టి అప్పుగా తెచ్చిన లక్షల కోట్లు దోచేశారు. త్వరలో విచారణ ప్రారంభం కాగానే బ్రోకరు గారు.. ‘నాకేం సంబంధం’ అంటూ పారిపోవడం ఖాయం’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
ఆర్థిక మంత్రి యనమలా? కుటుంబరావా?
‘ఇంతకీ ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక మంత్రిగా ఉన్నది యనమలా? కుటుంబరావా? యనమల డీజ్యూర్ అయితే, కుటుంబరావు సామాజిక కారణాల వల్ల డీఫ్యాక్టో అయ్యాడా? ఆరు కోట్ల ప్రజల ఆర్థిక వ్యవస్థను ఇన్నేళ్లుగా ఒక స్టాక్ బ్రోకర్ చేతిలో పెట్టారా?’ అని కూడా ఆయన మరో ట్వీట్ చేశారు.