ఇంటి పైకప్పుపై జాతీయ పతాకం ఎగుర వేసిన మంత్రి అతనొక్కడే
ట్విట్టర్లో ఎంపీ వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: మంత్రి నారా లోకేశ్ ఆయన ఇంటి పైకప్పు మీదే పోలీసుల గౌరవ వందనంతో జాతీయ పతాకాన్ని ఎగురవేయడం బద్దకానికి, తీవ్ర అధికార దుర్వినియోగానికి నిదర్శనమని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ‘స్వాతంత్య్ర దినోత్సవం రోజు పోలీసులతో గౌరవ వందనం అందుకుని ఇంటి పైకప్పు మీదే జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి లోకేశ్ నాయుడు ఒక్కరే. ఇది ఆయన శుద్ధ బద్ధకానికి, తీవ్ర అధికార దుర్వినియోగానికి నిదర్శనం’ అని ట్వీట్ చేస్తూ దీనికి సంబంధించిన ఫోటోలను విజయసాయిరెడ్డి విడుదల చేశారు.
ఎంత తిన్నాం అనేదే మీకు ముఖ్యం: ‘కేంద్రం ఇచ్చిన గ్రాంటును రాష్ట్రం తిరిగి కట్టనక్కర లేదు. అదే అమరావతి బాండ్ అని మీరు తెచ్చిన డబ్బులు వడ్డీ సహా తిరిగి కట్టాలి. ఈ రెండింటినీ మీరెందుకు ఒకేలా చూస్తున్నారో ప్రజలకు అర్థమైంది. గ్రాంట్ అయినా, బాండైనా మీకు అనవసరం. అందులో ఎంత తిన్నాం అన్నదే మీకు ముఖ్యం’ అని లోకేశ్ను ఉద్దేశించి విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు.
రాహుల్ బాబు కోడలిని కలవడం నీచ రాజకీయం: దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నాడు రాహుల్గాంధీ అధికార దురహంకారంతో కేసులు పెట్టించి గతంలో అన్యాయంగా జైలు పాలు చేశారు. అదే ఈరోజు చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణిని రాహుల్ కలుసుకున్నారు. ఇది దేనికి నిదర్శనం? రాహుల్గాంధీకి నీచ రాజకీయాలు మాత్రమే తెలుసని, ఎంతకైనా దిగజారతారని తెలియజేస్తోంది’ అని ట్విట్టర్లో విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబును దించినప్పుడే ఏపీకి స్వాతంత్య్రం: అవినీతి, అసమర్థ చంద్రబాబునాయుడు ప్రభుత్వానికి ఉద్వాసన పలికినపుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిజమైన స్వాతంత్య్రం లభిస్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతి, దుష్ట పరిపాలన నుంచి అప్పుడే విముక్తి లభిస్తుందని ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడే ఏపీ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని తెలిపారు.
వరద బాధితులను ఆదుకోవాలి: కేరళ, హిమాచల్ప్రదేశ్తో సహా దేశంలోని పలు ప్రాంతాల్లో సంభవించిన వరదల వల్ల నిరాశ్రయులైన వారిని ఆదుకోవాలని, పేదలకు యుద్ధ ప్రాతిపదికన సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.