‘ఆయనకు ఇష్టం లేకున్నా నిమ్మరసం ఇప్పించారు’

12 Feb, 2019 23:46 IST|Sakshi

బాబు ఒక యూ టర్న్‌ నిప్పు నాయుడు : విజయసాయిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. కులపిచ్చి, బంధుప్రీతి, నయవంచన, నీతిమాలిన పనులు చేయడంలో చంద్రబాబు ప్రపంచ రికార్డులన్నీ సొంతం చేసుకున్నాడని విమర్శించారు. అవినీతికి ఒక రూపం ఉంటే అది ‘యూ టర్న్‌ నిప్పు నాయుడు’ అని వర్ణించారు. మహాత్మాగాంధీతో పోల్చుకుంటున్న బాబుకు ఆయన నీడను కూడా తాకే అర్హత లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబును మించిన అవకాశవాది దేశం మొత్తంమీద ఎక్కడా ఉండరని ఆయన ధ్వజమెత్తారు. ‘దోచుకోవడానికే చంద్రబాబు కేంద్ర ప్రాజెక్టు పోలవరాన్ని నిర్మిస్తానని తీసుకున్నారని ఏడాది క్రితం జైరాం రమేష్‌ తీవ్ర ఆరోపణలు చేసి తిట్టిపోశారు. ఇవాళ ఇద్దరూ ఒక్కటై ఆలింగనాలు చేసుకుంటున్నారు. ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా అనిపిస్తుంది’ అని విజయసాయిరెడ్డి అన్నారు. (ఏపీ ప్రభుత్వం కోరినట్లే ప్యాకేజీలో మార్పులు చేశాం)

రిచ్‌గా ఉండేందుకు మాజీ ప్రధానితో నిమ్మరసం..
‘చంద్రబాబు ఎలాంటి వ్యక్తో మాజీ ప్రధాని దేవెగౌడకు బాగా తెలుసు. దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రైవేటు విద్యుత్‌ కంపెనీలకు లైసెన్సులు ఇప్పించి చంద్రబాబు ఎంత దోచుకున్నది అనేకమార్లు స్వయంగా ఆయనే   చెప్పారు. ఇప్పుడు బాబు చేపట్టిన దీక్ష ముగింపు రిచ్‌గా ఉండాలని చెప్పి దేవెగౌడను బతిమాలిఅక్కడకు తీసుకొచ్చారు. ఇష్టం లేకున్నా ఆయన చేత బాబుకు నిమ్మరసం తాగించారు’ అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘10 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ఢిల్లీలో మీరు చేసిన దీక్ష ఫొటోలు దిగడానికేనా’ అని ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు