చంద్రం సారు మళ్లీ చిటికెలేశారు: విజయసాయి రెడ్డి

27 Apr, 2019 16:38 IST|Sakshi

ఏ వైజాగో, ఎర్రగడ్డకో తీసుకెళ్లండయ్యా.... 

సాక్షి, హైదరాబాద్‌ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో తాను ఓటర్లను చైతన్యవంతం చేయబట్టే పోలింగ్‌ శాతం పెరిగిందని చంద్రం సారు మళ్లీ చిలికెలేశారని ఆయన ఎద్దేవా చేశారు. ‘మిగతా రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు పర్యటించి ఓటర్లను రఫ్పాడిస్తారట. రెండువారాల్లోనే ఇంత ముందిరిపోయిందేమిటి బాబుగారూ?. ఏ వైజాగో, ఎర్రగడ్డకో తీసుకెళ్లండయ్యా. ప్రభుత్వాధినేత అయి ఉండి ప్రతిదానికీ ప్రతిపక్షంపై నిందలు మోపడం మీకు సిగ్గనిపించడం లేదా చంద్రబాబూ?. స్ట్రాంగ్‌ రూముల వద్ద సీసీ కెమెరాలు పనిచేయకపోయినా, సీఎస్‌ రిటర్నింగ్‌ అధికారులతో సమీక్ష జరపినా మాకేం సంబంధం. పోలింగ్ ముగిసేంత వరకు అన్ని రకాల ప్రలోభాలకు పాల్పడింది మీరే కదా?’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్‌ చేశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ఏసీబీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావుపైనా విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ‘అవినీతి తిమింగలాలను పట్టేస్తానని ఏబీ వెంకటేశ్వరరావు అంటుంటే ‘హతోస్మి’ అనిపించింది.  చంద్రబాబు కోసం  ఫోన్‌ ట్యాపింగులు, ఎమ్మెల్యేల కొనుగోళ్లు మొదలు అడ్డమైన అన్ని పనులూ చేసిన ఈయన... తన అవినీతి మీద విచారణ ఎదుర్కొనే స్థితిలో ఉన్నారా? లేక ఇతరుల అవినీతిమీద విచారణ చేసే స్థితిలో ఉన్నారా?’  అని సూటిగా ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు