ఆర్టీసీని నష్టాల్లోకి ఎందుకు నెట్టావు బాబు?

12 May, 2019 11:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీని ఎందుకు నష్టాల్లోకి నెట్టారంటూ ముఖ్యమంత్రిని ఆయన నిలదీశారు. ‘ఏటా రూ.650 కోట్ల నష్టాలు వస్తుంటే తమరు నియమించిన ఎండీ సురేంద్రబాబు ఏం చేసినట్లు?. పోలవరం ప్రాజెక్ట్‌ సందర్శనకు బస్సులు సమకూర్చడంలో బిజీగా ఉన్నాడా?’ అని సూటిగా ప్రశ్నించారు. అనంతపురంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొని మరణ మృదంగం మోగుతోందని, వేలాది కుటుంబాలు కర్ణాటకకు తరలిపోతున్నాయని, పశువులు, గొర్రెలు మేత లేక పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారని అన్నారు. 

రెయిన్‌ గన్ల స్టోరీలు, నీటి గలగలలు, కియా కార్ల ఫ్యాక్టరీతో ఇంటికో ఉద్యోగం వచ్చిందని ఎన్నాళ్లు మోసం చేస్తురని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. ఇక చంద్రబాబు ప్రభుత్వ పోర్టల్‌లో పెట్టని రహస్య జీవోలన్నింటిని గవర్నర్‌ జోక్యం చేసుకుని బయటపెట్టాలని కోరారు. వదంల జీవోలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందని, తన విమానం అద్దెలు, దొంగ చెల్లింపుల జీవోలన్నింటిని దాచి పెట్టారని, కొత్త ప్రభుత్వం ఏర్పడేలోగానే బాబు బండారం బయటపెట్టాలని విజయసాయి రెడ్డి డిమాండ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు