‘తెలంగాణలో ఓడిన బాబు, బాలకృష్ణ’

11 Dec, 2018 14:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ‌: తెలంగాణ శాసనసభ ఎన్నిక​ల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్‌ ఓడిపోవడం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిన ప్రముఖుల జాబితా ఇదిగో అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ముందుగా ఉంది. బాలకృష్ణ, లగడపాటి రాజగోపాల్, వేమూరి రాధాకృష్ణ, రామోజీరావు, కాంగ్రెస్‌ పార్టీ పేర్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

‘తెలంగాణ ప్రజానీకం తిరుగులేని తీర్పుతో సైకిల్‌కు ముందు చక్రం ఊడిపోయింది. నాయుడుబాబుకు చావుతప్పి కన్నులొట్టబోయింది. సైకిల్‌ వెనుక చక్రం కూడా పీకి చంద్రబాబు పీడను ఎంత త్వరగా ఒదిలించుకోవాలా అని ఆంధ్ర ప్రజలు కసిగా ఎదురుచూస్తున్నార’ని ట్వీట్‌ చేశారు. పవిత్ర కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిన పత్రికలు టీడీపీ కరపత్రాలుగా మారాయి. ఈసీ నిబంధన ప్రకారం నియోజక వర్గంలో రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి. నాయుడు బాబు దాన్ని 28 కోట్లకు తీసుకు వెళ్లారు. కూకట్‌పల్లిలో వంద కోట్లు వెదజల్లారు. ఫలితాన్ని1% కూడా మార్చలేక పోయారు. బాబూ యూ ఆర్ అవుట్.’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తును ప్రజలు తిరస్కరించారని విజయసాయిరెడ్డి ఢిల్లీలో అన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ హిమాలయ శిఖరం అంత తప్పు చేసిందని అభిప్రాయపడ్డారు.  చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం  పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశంలోను రిపీట్ అవుతాయన్నారు. ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు  దోపిడీ కక్కిస్తే ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయల పంచవచ్చని, చంద్రబాబు కబ్జా చేసిన భూములను తీసుకుంటే ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఉచితంగా ఇవ్వచ్చని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు