దివాలాకోరు లగడపాటి సర్వే పెద్ద బోగస్‌

20 May, 2019 03:36 IST|Sakshi

వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శ

సాక్షి, అమరావతి: నలభై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి లగడపాటి రాజగోపాల్‌ దివాలా తీశారని, ఆయన ఇచ్చే సర్వే పెద్ద బోగస్‌ అని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా ధ్వజమెత్తారు. ఈ సర్వేను ఆసరా చేసుకుని ‘కిరసనాయిలు’ పగలు బాబుకు, రాత్రి బుకీలతో డీల్స్‌ కుదుర్చుతున్నాడన్నారు. తెలంగాణ ఎన్నికల్లో వీళ్లిద్దరూ ఇలాగే బోగస్‌ సర్వే ఇచ్చి రూ.వెయ్యి కోట్లు సంపాదించారని, మళ్లీ అదే డ్రామా ఆడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు విదిల్చే కాంట్రాక్టు, బుకీస్‌ ఇచ్చే కమీషన్లపై లగడపాటి రోజులు వెళ్లదీస్తున్నాడన్నారు. ‘భీమవరం, విజయవాడ కేంద్రాలుగా బెట్టింగ్‌ ఆడేవారు 90 శాతం మంది ఫ్యాన్‌ గెలుస్తుందని పెట్టారట. బుకీలు రూ.వేల కోట్లు నష్టపోయేట్టున్నారు.

లగడపాటి, కిరసనాయిలు ఇద్దరూ కలిసి బాబు కోసం, బుకీల కోసం ఆడుతున్న డ్రామా ఇది’ అని పేర్కొన్నారు. ‘లగడపాటి లాంటి వారు సర్వే చేస్తారు. బుకీలు యాక్టివ్‌ అయిపోతారు. అమాయకులను నమ్మించి సైకిల్‌పై పందేలు పెట్టిస్తారు. తన పేపర్లో ఎన్ని సీట్లలో గెలిచేది కిరసనాయిలు రాస్తాడు. సాయంత్రం 6 గంటలలోగా బుకీలు సేఫ్‌’ అని దుయ్యబట్టారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి లగడపాటి ఊగాడని.. ఆ పార్టీ పరిస్థితి అర్థమై ఓడిపోయే దానికి ఎందుకులే అని తప్పుకున్నాడని, ఇప్పుడేమో పార్టీతో సంబంధం లేదని కోతలు కోస్తున్నాడని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు