పేదల ముద్దలో కమిషన్లు తిన్నారు!

6 Sep, 2019 10:49 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రావాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆర్టీసీని మూసివేత దశకు చేర్చి వెళ్లిపోతే...ఆర్టీసీ కార్మికుల కష్టాలు తీరుస్తానన్న సీఎం జగన్‌ తన మాటను నిలబెట్టుకుని సంస్థకు ఊపిరి పోశారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రైవేట్‌ ఆపరేటర్ల కోసం ఆర్టీసీని కొల్లగొట్టారని మండిపడ్డారు. విలువైన భూములను చంద్రబాబు తన వాళ్ల మల్లీపెక్సుల నిర్మాణాల కోసం లీజుకిచ్చారని ఆరోపించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

చదవండి : ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం

అదే విధంగా 203 అన్న క్యాంటీన్ల నిర్మాణంలో రూ. 53 కోట్ల అవినీతి జరిగినట్టు విచారణలో తేలిందని విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. పేదల అన్నం ముద్దలో కూడా తండ్రీ, కొడుకులు కమిషన్లు తిన్నారని చంద్రబాబు, లోకేశ్‌లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రెండు కాంట్రాక్టు సంస్థలతో వాటాలు మాట్లాడుకుని, వాటికే పనులు దక్కేలా టెండర్లు రూపొందించారని దుయ్యబట్టారు. వీటి నిర్మాణం కోసం చదరపు అడుగుకు రూ. 4500 ఖర్చవుతుందా బాబు గారూ అని ట్విటర్‌లో ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు