‘దేవుడే చంద్రబాబుకు జ్ఞానం ప్రసాదించాలి’

13 Feb, 2019 20:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రత్యేక విమానాలు, రైళ్లు, లగ్జరీ హోటళ్లలో బస, విందులు, భారీ పబ్లిసిటీలతో నిరసన తెలుపుతూ ‘చంద్ర’ గాంధీ కొత్త సంప్రదాయానికి తెరలేపారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. చంద్రబాబు అవినీతి, దొంగ దీక్షలపై బుధవారం ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు.

‘ నిరాహార దీక్ష అంటే సత్యాగ్రహం. ఒంటి పూట నిరసనకు రూ.11 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేసి సత్యాగ్రహం అంటే ఎలా? పిల్లల కష్టపడి సంపాదించిన సొమ్మును తాగేసిన తాగుబోతు తండ్రి చంద్రబాబులో కనిసిస్తున్నారు. లగ్జరీ హోటళ్లలో బస, భారీ పబ్లిసిటీతో నిరసన దీక్షలకు ‘చంద్ర’ గాంధీ కొత్త సంప్రదాయానికి తెర లేపారు’ అని విమర్శించారు. (నల్లచొక్కాలాగే నిమ్మరసం కూడా..)

వ్యతిరేకించడం వేరు.. అవమానించడం వేరు బాబు..
‘రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్‌లాంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి పద్దతులను వ్యతిరేకించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వారిని నీచమైన మాటలతో తులనాడటం కుసంస్కారం అవుతుంది. వ్యతిరేకించడం వేరు,అవమానించడం వేరు చ్రందబాబు. ఆ దేవుడే చంద్రబాబుకు జ్ఞానం ప్రసాదించాలి’ అని వ్యంగ్యంగా విమర్శించారు.
 
ప్రతిదీ కౌంట్‌ అవుతోంది బాబు..
‘ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు 2003లో ఐఎంజీ స్పోర్ట్స్‌ అనే బోగస్‌ సంస్థకు హైదరాబాద్‌లో 850 ఎకరాల భూమిని కేటాయించారు. ఇక ఎన్నికల ముందు రూ. 200 కోట్ల ప్రజాధనంతో దొంగ దీక్షలు చేయడం వింతేమి కాదు. ప్రతిదీ కౌంట్‌ అవుతోంది బాబు.. ప్రజా కోర్టులో జవాబు చెప్పుకోక తప్పదు’ అని విజయసాయి రెడ్డి హెచ్చరించారు.

మరిన్ని వార్తలు