పవన్‌కు విజయశాంతి కౌంటర్

25 Jan, 2018 18:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ తెలంగాణలో చేపట్టిన రాజకీయ యాత్రపై నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి స్పందించారు. పవన్ రెండు కళ్ల సిద్ధాంతం ఇక్కడ పనిచేయదంటూ కౌంటర్ ఇచ్చారు. గురువారం ఇక్కడ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పలు విషయాలను ఆమె ప్రస్తావించారు. రాష్ట్ర ప్రజల్లో టీఆర్ఎస్ పాలనపై తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. సీఎం కేసీఆర్ పాలన ఎక్కడ స్మార్ట్‌గా ఉందో చెప్పాలని పవన్ కల్యాణ్‌ను విజయశాంతి ప్రశ్నించారు.

పవన్ రెండు కళ్ల సిద్ధాంతం తెలంగాణలో పని చేయదంటూ ఆయన తీరును విమర్శించారు. తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గతేడాది అన్నాడీఎంకే నాయకురాలు వీకే శశికళను విజయశాంతి కలుసుకున్న నేపథ్యంలో ఆమె ఏఐఏడీఎంకే పార్టీలో చేరనున్నారని, తమిళ రాజకీయాల్లోకి ఈ ‘లేడీ సూపర్ స్టార్’ ఎంట్రీ ఖాయమంటూ వదంతులు ప్రచారమైన సంగతి తెలిసిందే. త్వరలో పార్టీలో క్రియా శీలకంగా పనిచేస్తానని చెప్పిన విజయశాంతి.. కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్పినా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

   
 

మరిన్ని వార్తలు