తెలంగాణ వ్యతిరేక పార్టీ కాంగ్రెస్సే

22 Sep, 2018 02:33 IST|Sakshi

గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ ఎంపీ వినోద్‌

తెలంగాణ ఊరికే ఇవ్వలేదు.. ఉద్యమంతో సాధించుకున్నం

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ స్వతహాగా తెలంగాణ వ్యతిరేక పార్టీ అని, తప్పనిసరి పరిస్థితుల్లోనే తెలం గాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో టీఆర్‌ఎస్‌ పాత్ర సూది మొనంత కూడా లేదన్న కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఆజాద్‌ వ్యాఖ్యలపై తెలంగాణ, ఏపీ ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలను మభ్యపెట్టేందుకే కాం గ్రెస్‌ నేతలు అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు.

ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ నేత ఈద శంకర్‌రెడ్డితో కలసి వినోద్‌ తెలంగాణ భవన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ‘కాంగ్రెస్‌లో గులాంనబీ ఆజాద్‌ పాత్ర ఏమిటో నాకు తెలుసు. ఎన్నికల్లో గెలవలేమన్న భయం కాంగ్రెస్‌ నేతలకు పట్టుకుంది. తెలంగాణ గురించి ఆజాద్‌కు ఏమీ తెలియదు. తెలంగాణ బిల్లు మాకు తెలియకుండా సిద్ధం చేశారా.. అనేక అంశాలపై మేం సవరణలు అడిగినం. ఏపీలో కలిపిన ఏడు మండలాలు కూడా మాకే కావాలన్నాం. ముందు సరే అని చెప్పి చం ద్రబాబుకు లొంగి ఏడు మం డలాలు వాళ్ళకే ఇచ్చారు. తెలంగాణ ఊరికే ఇవ్వలేదు. ఉద్యమంతో సాధించుకున్నం’ అని  వ్యాఖ్యానించారు.

గులాబీ జెండా నీడలోనే తెలంగాణ బిడ్డ..
2004 ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పరిస్థితి బాగాలేనప్పుడు టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం ఆజాద్‌ కేసీఆర్‌ ఇంటికి వచ్చారని వినోద్‌ గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే ఆ రోజు టీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ పొత్తుపెట్టుకుందని.. ఆ తర్వాత తెలంగాణ ఏర్పాటును విస్మరించిందని ఆరోపించారు. ‘కొత్తగా పుట్టిన తెలంగాణ బిడ్డ తల్లి దగ్గరే ఉండాలని ప్రజలు మా చేతుల్లో పెట్టారు. గులాబీ జెండా నీడలోనే  బిడ్డ పెరుగుతుంది. కేసీఆర్‌ ఆమరణదీక్షతో యావత్‌ తెలంగాణ ఒక్కటైంది.

కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తున్న ట్లు ప్రకటించి ఆంధ్రా నేతలకు లొంగి ప్రకటనను వెనక్కి తీసుకోలేదా. అప్పుడు ఒక్క కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ రాజీనామా చేశారా. ఉద్యమ తీవ్రతకు భయపడే కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ గురించి మాట్లాఛ్ఛిరు. ఉద్యమాన్ని అణచేసేందుకు కాంగ్రెస్‌ ఎన్నో సార్లు ప్రయత్నించింది. ఇవన్నీ గుర్తు పెట్టుకునే తెలంగాణ ప్రజలు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పారు’ అని వినోద్‌ చెప్పారు.  

మరిన్ని వార్తలు