మోదీకి ప్రతిబింబమే కేసీఆర్‌: వివేక్‌ థంకా

16 Sep, 2018 02:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్య గొంతుకను అణచివేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ధోరణి ఒక్కటేనని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు, ఏఐసీసీ అధికార ప్రతినిధి వివేక్‌ థంకా విమర్శించారు. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ ప్రతిబింబమని, ఇద్దరి పాలనా నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా నిలుస్తోందని దుయ్యబట్టారు. ఢిల్లీలో బడా మోదీ.. రాష్ట్రంలో చోటా మోదీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వాలను పారద్రోలి, మార్పు తేవాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ చైర్మన్‌ దామోదర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ కళాభవన్‌లో ‘సేవ్‌ తెలంగాణ చేంజ్‌ తెలంగాణ’ పేరుతో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది.

సదస్సులో వివేక్‌ థంకా మాట్లాడు తూ, కుటుంబం గురించి ఆలోచించే వారు, అవి నీతికి పాల్పడే వారు, ప్రజాస్వామ్యాన్ని అపహా స్యం చేసే సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. ఇలాంటి వారిని తరిమేయడమే శరణ్యమని, లేదంటే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.  కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నేతలపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి మానవ హక్కుల హననానికి పాల్పడుతోందని ఏఐసీసీ లీగల్‌ సెల్‌ చైర్మన్‌ విపుల్‌ మహేశ్వరి ఆరోపిం చారు. మీడియా, ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తోందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, పీసీసీ ఉపాధ్యక్షుడు నర్సింహారెడ్డితోపాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు