ఢిల్లీ గడ్డపై  బాపట్ల వాణి వినిపిస్తా

9 Apr, 2019 11:19 IST|Sakshi

సాక్షి, బాపట్ల : ‘బాపట్ల పార్లమెంట్‌ అభ్యర్థిగా నన్ను నిలబడాలని జగనన్న చెబితే మొదట్లో అర్థంకాలేదు... సామాన్యుడినైన నాకు ఎంపీ టిక్కెట్టా అని అడిగితే.. సామాన్యుడు ఎంపీ కాకూడదా అంటూ జగనన్న చిరునవ్వుతో బదులిచ్చారు. మా అధినేత నింపిన స్ఫూర్తితో బాపట్ల ఎంపీగా గెలుస్తా. బాపట్ల గల్లీ వాణిని ఢిల్లీ వేదికగా దేశ ప్రజలకు వినిపిస్తా..’ అని బాపట్ల పార్లమెంట్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నందిగం సురేష్‌బాబు అన్నారు.

బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో సాగు, తాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని... తాను ఎంపీగా గెలుపొందిన వెంటనే ఈ సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచనలేకుండా కృషి చేస్తానని చెప్పారు. ఒక సామాన్యుడు ఎంపీ స్థాయికి ఎదగటం, ప్రజాసేవ చేసే అవకాశం రావడం తమ పార్టీ అధినేత గొప్పతనమని అన్నారు.

ఎంతో మంది సామాన్యులు తామే ఎంపీ అభ్యర్థిగా ఉన్నామని భావిస్తూ తన గెలుపు కోసం కష్టపడి పనిచేస్తున్నారని సంతోషం వ్యక్తంచేశారు. తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆయన ఏకంగా పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. 

ప్రశ్న: బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయడాన్ని ఏవిధంగా భావిస్తున్నారు.
జవాబు : ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు, చీరాల, అద్దంకి, పర్చూరు, గుంటూరు జిల్లాలోని బాపట్ల, రేపల్లె, వేమూరు నియోజకవర్గాలతో కూడిన బాపట్ల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయటం ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో మంది ప్రముఖులు గెలుపొందిన ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం రావడం గొప్పగా భావిస్తున్నా. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు శక్తివంచనలేకుండా పనిచేస్తా. బాపట్లను కచ్చితంగా అభివృద్ధి వైపు పరుగులు తీయిస్తా.
ప్రశ్న: ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి?
జవాబు: రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గాలి వీస్తోంది. సీఎం చంద్రబాబునాయుడి పాలనపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఎక్కడకు వెళ్లినా మా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలపైనే జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రజలు కూడా నవరత్నాలపైనే విశ్వాసంగా ఉన్నారు. సామాన్యుడినైన నాకు ఎంపీగా అవకాశం రావడంతో నేను ఎక్కడికి వెళ్లినా మంచి ఆదరణ కనిపిస్తోంది. నా గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఎంతో కష్టపడుతున్నాయి. కచ్చితంగా గెలిచి తీరుతా.
ప్రశ్న: బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో సమస్యలను గుర్తించారా?
జవాబు: బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంపై నాకు పట్టు ఉంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఈ పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించి పట్టుసాధించా. ఈ నియోజకవర్గంలో తాగు, సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు శక్తివంచనలేకుండా కృషి చేస్తా. నిరుద్యోగ సమస్య కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. నిరుద్యోగులకు ఉపాధి చూపేందుకు పారిశ్రమికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందేందుకు శ్రమిస్తా. 
ప్రశ్న: ప్రచారం ఎలా సాగుతోంది?
జవాబు: ఎన్నికల ప్రచారం చాలా చక్కగా సాగుతోంది. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. బాపట్ల పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పాటికే ప్రచారం పూర్తిచేశా. ఎక్కడ చూసినా ఫ్యాన్‌ గాలి వీస్తోంది. ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వస్తేనే సంక్షేమ పాలన అందుతుందని భావిస్తున్నారు. నవరత్నాలు ఎప్పుడు అందుతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ప్రశ్న: నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? 
జవాబు: బాపట్ల పార్లమెంటు స్థానాన్ని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కచ్చితంగా సొంతం చేసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో ఉన్న శ్రీరామ్‌మాల్యాద్రి గత ఐదేళ్లు ఎంపీగా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో ప్రజలను కలిసి ఓట్లు అడిగారు. ఆ తరువాత ప్రజలకు కనిపించలేదు. దీంతో ప్రజలు ఆయనపై తీవ్రవ్యతిరేకతతో ఉన్నారు. ఇది నాకు కలిసొచ్చే అంశం. ప్రజలు చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రాష్ట్రానికి దిక్సూచి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని భావిస్తున్నారు.  
ప్రశ్న: ఎంపీగా గెలిచాక ఎలా ఉంటారు? 
జవాబు: బాపట్ల పార్లమెంటు నియోజకవర్గం చరిత్రలోనే ఒక సామాన్యుడు ఎంపీ అభ్యర్థిగా వస్తారని ప్రజలు ఊహించలేదు. నేను ఒక సామాన్యుడిగా ప్రజల ముందుకు వచ్చాను. నన్ను ప్రజలు గెలిపిస్తే వారి మధ్యనే ఉంటా. వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటా. బాపట్ల గల్లీ నుంచే ఢిల్లీకి నా వాణిని వినిపిస్తా. ఒక నాయకుడు ఏవిధంగా ఉండాలో అదే విధంగా ఉండి చూపిస్తా. ప్రత్యేక హోదా సాధన కోసం పార్లమెంట్‌ వేదికగా పోరాడుతా.

మరిన్ని వార్తలు