హిట్లర్‌, ముస్సోలినీ, మోదీ వంటి నేతలు మనకొద్దు!

16 Mar, 2019 16:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీని ప్రపంచ నియంతృత్వ నేతలు అడాల్ఫ్‌ హిట్లర్‌, ముస్సోలినితో పోల్చుతూ దిగ్విజయ్‌ సింగ్‌ శనివారం విమర్శలు గుప్పించారు. ప్రపంచ శాంతిని కోరుకునే నేతలు కావాలని, కానీ జాతి విద్వేశాలు రెచ్చగొట్టే నేతలు వద్దంటూ ఆయన ట్వీట్‌ చేశారు. "మనకు మహాత్మా గాంధీ, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ వంటి వారు కావాలి. అంతేగానీ, హిట్లర్‌, ముస్సోలినీ, మోదీ వంటి వారు కాదు’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
న్యూజిలాండ్‌లో నరమేధం

న్యూజిలాండ్‌లో శుక్రవారం జరిగిన కాల్పుల ఘటనలో 49 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఘటనై కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ చేసిన ట్వీట్‌ను ఆయన రీట్వీట్ చేస్తూ దిగ్విజయ్‌ ఈ విధంగా స్పందించారు. ‘నేను రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నాను. సనాతన ధర్మంతో పాటు గౌతమ బుద్ధుడు, మహావీర్‌ వంటి వారు ప్రచారం చేసిన శాంతి, జాలి, దయా వంటి సిద్ధాంతాలు ప్రపంచానికి కావాలి. అంతేగానీ, విద్వేషం, హింస రేపే భావజాలం కాదు'' అని దిగ్విజయ్‌ అభిప్రాయపడ్డారు.

కాగా, న్యూజిలాండ్‌లో జరిగిన కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో మృతులకు సంతాపం తెలుపుతూ శుక్రవారం రాహుల్‌ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘న్యూజిలాండ్‌లో జరిగిన కాల్పులు ఉగ్రవాదానికి చెందిన నీచపు చర్య. ఇటువంటి చర్యను పూర్తిగా ఖండించాలి. ఇటువంటి వాటిని అర్థం చేసుకుంటూ వీటికి వ్యతిరేకంగా ప్రపంచం నిలబడుతోంది. ప్రత్యేక భావజాలంతో, విద్వేషంతో కూడిన ఈ తీవ్రవాదం ఉండడానికి వీల్లేదు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఈ ఘటనలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.


 

మరిన్ని వార్తలు