ప్రియాంకాకు కొత్తపేరు పెట్టిన బీజేపీ నేత

6 Jun, 2020 21:09 IST|Sakshi

ల​క్నో : కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రాకు ఉత్తరప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య కొత్త పేరు పెట్టారు. ఆమెకు ‘ప్రియాంకా ట్విటర్‌ వాద్రా’గా నామకరణం చేశామని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీని సోషల్ మీడియా మాత్రమే ఒక గొప్ప జాతీయ స్థాయి నాయకురాలిగా చూపిస్తోందని కానీ, ప్రజలు మాత్రం ఆమెను అలా గుర్తించడంలేదన్నారు. 2019 ఎన్నికల్లో తన సోదరుడు రాహుల్‌ గాంధీని కూడా గెలిపించుకోని ఆమె.. జాతీయ నాయకురాలు ఎలా అవుతుందని ప్రశ్నించారు. 
(చదవండి : దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను నాశ‌నం చేస్తున్నారు)

కాగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో యాంకా గాంధీ వరుసగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్న విషయం తెలిసిందే. వలస కార్మికుల గురించి సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మీద విరుచుకుపడుతున్నారు. యూపీకి చెందిన వలస కార్మికులను సొంతూళ్లకు చేర్చేందుకు సొంతంగా వాహనాలను కూడా ఏర్పాటు చేశారు. వరుసగా ఆమె ట్వీట్లు చేస్తూ బీజేపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రియాంక

ఈ క్రమంలో కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రియాంకా గాంధీని నేను ఎప్పుడూ సిరియస్‌గా పరిగణించలేదు. ఆమెకు 'ప్రియాంక ట్విట్టర్ వాద్రా'గా తాము ఎప్పుడో నామకరణం చేశాం. రెండు మూడు రోజులకు ఒక ట్వీట్‌ చేస్తూ మీడియాలో బిజీ అయిపోతారు. సోషల్‌ మీడియా మాత్రమే ఆమెను జాతీయ స్థాయి నాయకురాలిగా చూపిస్తోంది. అంతే కానీ ప్రజలు అమెను పట్టించుకోవడం లేదు. 2019 ఎన్నికల్లో సోదరుడు రాహుల్‌ గాంధీని ప్రధాన మంత్రిని చేసేందుకు గాను ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం చేసిన ప్రియాంకా..ఘోర పరాభావాన్ని చవిచూసిన విషయం అందరికి తెలిసిందే. సొంత సోదరుడినే గెలిపించుకోలేని ఆమె జాతీయ నాయకురాలు ఎలా అవుతుంది’ అని మౌర్య ప్రశ్నించారు. కాగా, గత పార్లమెంటు ఎన్నికల్లో స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు