‘బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు’

11 Jan, 2019 15:53 IST|Sakshi
స్టాలిన్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, చెన్నై: రానున్న ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌ తేల్చిచెప్పారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను వాజ్‌పేయీతో పోల్చుకోవడం నిజంగా హాస్యాస్పదం. ఆయన ఎప్పటికీ వాజ్‌పేయీ కాలేరు. ఆయన లాంటి రాజకీయాలు మోదీ చెయ్యలేరు’’ అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. తమిళనాడు బీజేపీ కార్యకర్తలతో మోదీ ఇటీవల వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ.. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలతో పొత్తుకు బీజేపీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటుందని అన్నారు. మోదీ వ్యాఖ్యలపై స్టాలిన్‌ స్పందిస్తూ.. బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదన్నారు.

గతంలో డీఎంకే, బీజేపీ పొత్తు పెట్టుకున్న మాట వాస్తవమేనని, కానీ వాజ్‌పేయీ లాంటి నిర్ణయాత్మక రాజకీయాలు మోదీ చెయ్యలేరని స్టాలిన్‌ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు చెన్నైలో శుక్రవారం జరిగిన పార్టీ సమావేశంలో స్టాలిన్‌ చెప్పారు. వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్న సమయంలో ప్రాంతీయ పార్టీలకు కలుపుకుని పోయారని, కానీ ఇప్పుడు బీజేపీలో అలాంటి నాయకత్వం లేదని స్టాలిన్‌ అన్నారు. కాగా 1999 ఎన్నికల్లో బీజేపీ,డీఎంకే కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు