మంత్రి అనిల్కుమార్ యాదవ్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయానికే పూర్తి చేస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి అనిల్కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. పోలవరం ఆగిపోయిందని ఎవరు చెప్పారని పచ్చ మీడియాను నిలదీశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చెదిరిన చక్రం పేరుతో రామోజీరావు పేపర్లో ఆటోనగర్ అతలాకుతలమని రాశారని, అసలు అమరావతి, పోలవరానికి ఆటోనగర్తో ఏం సంబంధమని ప్రశ్నించారు. మరో పత్రికలో రాష్ట్రానికి పెట్టుబడుల గండం అని, కియా కథ మళ్లీ మొదటికి అంటూ అవాస్తవాలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్, లోకేష్ సన్నిహితుల ఇళ్లల్లో జరుగుతున్న ఐటీ సోదాలను పక్కదారి పట్టించేందుకే ఎల్లో మీడియా ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. రామోజీకి బంధువైన నవయుగ కంపెనీకి పోలవరం ప్రాజెక్టు పనులు దక్కలేదని అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ ముందుకు దూసుకుపోతోందని, దీంతో ఓర్వలేక ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని విమర్శించారు.