12 ఈవీఎంలతో కొత్త చరిత్ర సృష్టిస్తా: కవిత

3 Apr, 2019 21:31 IST|Sakshi

జగిత్యాల: లోక్‌సభ ఎన్నికల్లో 12 ఈవీఎంలతో విజయం సాధించడంలో కొత్త చరిత్ర సృష్టిస్తానని నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్‌ ఎంపీ స్థానానికి 185 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల అధికారులు ఎక్కువ సంఖ్యలో ఈవీఎంలను వాడాల్సిన అవసరమేర్పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాలలో బుధవారం కవిత రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..ఎన్నికల్లో తాము చెప్పిన హామీలన్నీ అమలు చేశామన్నారు.

గత శాసనసభ ఎన్నికల సమయంలో ఇస్తామన్న హామీ మేరకు పెంచిన పెన్షన్‌ను మే 1 నుంచి ఇస్తామని వెల్లడించారు. గజ్వేల్ స్థాయిలో జగిత్యాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన ఐదేండ్లలో ఇంత అభివృద్ధి సాధించాం.. మరి గడచిన 70 ఏండ్లలో ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు లేకుంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో పోరాడాలంటే టీఆర్‌ఎస్‌ ఎంపీ ఉంటేనే సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ చెప్పే విషపూరిత మాటలు నమ్మవద్దని అన్నారు. 
 

మరిన్ని వార్తలు