సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, టీఆర్ఎస్ మిలాఖత్ రాజకీయాలకు హుజూర్నగర్ ఉపఎన్నిక తెరలేపినట్లుగా కనిపిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ అసెంబ్లీ చివరి మూడు రోజులు సభను రాజకీయ సభగా మార్చారని విమర్శించారు. ఒక దశలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి బీజేపీని ఎదుర్కోవాలని చేసిన ప్రకటన గమనిస్తే మిలాఖత్ రాజకీయాలు అర్ధం అవుతున్నాయని పేర్కొన్నారు. హుజూర్ నగర్ ఎన్నికలలో టీఆర్ఎస్ గెలుపు సులువు కాదని ముఖ్యమంత్రికి అర్ధం అయ్యిందని, అందుకే పరోక్షంగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ఎత్తుగడలు వేసినా హుజూర్ నగర్ ఎన్నికలలో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.