సాక్షి, మెదక్: తెలంగాణలో 16 ఎంపీ సీట్లను కైవసం చేసుకుని కేంద్రాన్ని శాసించడమే టీఆర్ఎస్ లక్ష్యమని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు అన్నారు. ఈ నెల 8న టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అధ్యక్షతన మెదక్ పార్లమెంటరీ స్థాయి నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం పట్టణంలో జరుగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన హవేళి ఘణాపూర్ మండల కేంద్రంలోని డైట్ కళాశాల పక్కన.. రూరల్ పోలీస్ స్టేషన్ పక్కన.. సీఎస్ఐ చర్చి మైదానాలను ఆయన పరిశీలన చేశారు.
సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ శేరి సుభాష్రెడ్డి, మెదక్, నర్సాపూర్ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్రెడ్డి, మదన్రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తదితరులతో కలిసి హరీష్రావు పరిశీలించారు. సన్నాహక సభకు సీఎస్ఐ చర్చి మైదానాన్ని ఫైనల్ చేసినట్లు వెల్లడించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్వైపే ఉన్నారని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎంపీ సీట్లన్నింటినీ భారీమెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం.. టీఆర్ఎస్పై ఆధారపడే విధంగా గెలుపొంది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ఏకైక లక్ష్యంగా సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు.