సన్యాసిని సీఎం చేస్తే ఏం ఒరిగింది!

4 Apr, 2018 15:38 IST|Sakshi
కాంగ్రెస్ నేత రాజ్ బబ్బర్, కంప్యూటర్ బాబా (ఫైల్ ఫొటో)

సాక్షి, భోపాల్: ఐదుగురు సాధువులకు మంత్రి పదవులు ఇవ్వడం మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. వారు ఏం సాధించారని మంత్రి హోదా కల్పిస్తారని ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ను ప్రశ్నిస్తోంది. మత గురువులైన నర్మదానంద్‌ మహరాజ్‌, కంప్యూటర్‌ బాబా, హరిహరానంద్‌ మహరాజ్‌, భయ్యూ మహరాజ్‌, పండిత్‌ యోగేంద్ర మహంత్‌లకు మంత్రి హోదా ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు నర్మదా నది సంరక్షణా కమిటీ సభ్యులుగా ఉన్నారు.

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ రాజ్ బబ్బర్ బీజేపీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాషాయం వస్త్రాలు ధరించిన సాధువులను చూపించి ఓట్లడిగి ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. ఓ సన్యాసిని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే ఏం జరిగిందో దేశం మొత్తం చూసిందని రాజ్ బబ్బర్ పేర్కొన్నారు. నేరాలు పెరిగిపోవడం, మత ఘర్షణలు జరగడం తప్ప ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. కేవలం తమ పాపాల నుంచి విముక్తి పొందేందుకే బాబాలు, సాధువులకు పదవులు, హోదాలు బీజేపీ కల్పిస్తుందన్నారు.

సహాయ మంత్రులుగా తమని నియమించడంపై కంప్యూటర్ బాబా స్పందించారు. బాబాలు, మత గురువులు, సాధువులకు పదవులు కట్టబెట్టడంలో తప్పేముందని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. మేం చేసిన పనికి ప్రతిఫలం లభించినట్లు భావిస్తున్నాం. నర్మదా ఘటాలా అవినీతితో పాటు నర్మదా నది పరిరక్షణలో జరిగిన అక్రమాలు, అవినీతిని బయటపెట్టినట్లు కంప్యూటర్ బాబా గుర్తుచేశారు. సాధువులను నర్మదా పరిరక్షణ నేపథ్యంలో సహాయ మంత్రులుగా నియమించడంలో తప్పేంలేదని, ప్రొటోకాల్ ప్రకారమే వారికి బాధ్యతలు అప్పగించామని బీజేపీ అధికార ప్రతినిధి రజనీశ్ అగర్వాల్ తెలిపారు. దీంతో ప్రజలు భాగస్వాములుగా మారితే నది పరిరక్షణ పనులు తేలికగా జరుగుతాయని చెప్పారు.

మరిన్ని వార్తలు